పరస్పరం దాడులు: హైదరాబాద్లో అశోక్ బాబుపై కేసు నమోదు
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబుపై హైదరాబాద్లో కేసు నమోదైంది. గన్ఫౌండ్రిలోని ఏపీఎన్జీవోల కార్యాలయంలో ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో అశోక్బాబుతో పాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిపై అబిడ్స్ పోలీసులు ఐపీసీ 323, 506, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వీరితోపాటు బీటీఎన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ సహా ఇతరులపైనా ఐపీసీ 523, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం ఏపీ ఎన్జీవోల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏపీఎన్జీవో, బీటీఎన్జీవో నేతలు పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారు.
ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొంతమంది అశోక్బాబు, ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్రెడ్డి తదితరులపై చేయి చేసుకున్నారు.
ఈ ఘర్షణలో హోంలోని ఫర్నీచర్, సీసీ కెమెరాలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. అక్కడికి చేరుకున్న ఆబిడ్స్ పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి నేతలను బయటకు పంపించారు. అనంతరం అబిడ్స్ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో వారిపై కేసులు నమోదయ్యాయి.
కాగా, గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీని విభజించాలని కోరుతున్నప్పటికీ అశోక్బాబు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాడని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ ఆరోపించారు. సొసైటీ పేరుతో ఉద్యోగుల నుంచి రూ.34 కోట్లు వసూలు చేశారని, అందులో రూ.18 కోట్లకు అభివృద్ధి పేరిట తప్పుడు లెక్కలు చూపించారని చెప్పారు. అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే తమపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అశోక్ బాబు ఆరోపించారు. సమస్యను సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలే తప్ప దాడులు చేయడం సరికాదని అన్నారు.