కేబీఆర్ పార్కులో పట్టపగలే మహిళపై కత్తితో దాడి: చైన్స్నాచర్కు దేహశుద్ధి, అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కులో పట్టపగలే మహిళపై దాడి జరిగింది. మహిళకు కత్తి చూపించి బెదిరించిన దుండగుడు బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. మహిళ మెడలో ఉన్న గొలుసును, చెవిరింగులను లాక్కుని పరారవుతుండగా ఆమె కేకలు వేసింది.
అప్రమత్తమైన స్థానికులు ఆ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలు బుధవారం కేబీఆర్ పార్కుకు మార్నింగ్ వాక్కు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలు మాట్లాడుతూ.. తాను మార్నింగ్ వచ్చిన సమయంలో ఆ దొంగ తనను కత్తి చూపించి తన వద్ద ఉన్న బంగారు గొలుసు, సెల్ఫోన్ ఇవ్వాలని బెదిరించాడని తెలిపింది. తాను ఇవ్వనని చెప్పడంతో తనపై కత్తితో దాడి చేశాడని చెప్పింది.
ఆ తర్వాత తన వద్ద ఉన్న బంగారు గొలుసును, చెవి రింగులను ఎత్తుకెళ్లాడని తెలిపింది. తాను కేకలు వేయడంతో స్థానికులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెప్పింది. కాగా, ఆ దొంగ దాడిలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
వృద్ధురాలిని హత్య చేసి నగలతో పరార్
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ఎంసీహెచ్ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో సుగణ అనే వృద్ధురాలని హత్య చేసిన దుండగులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో ఉడాయించారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.