అప్పటికీ,ఇప్పటికీ ప్రజలకు ఆ మార్పు కనిపించాలి... కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు...
రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ చట్టం అమలులో రెవెన్యూ అధికారులు,సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని చెప్పారు. కొత్త చట్టం అమలు నేపథ్యంలో గతానికి,ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. ప్రజల్లో పెరిగిన చైతన్యానికి అనుగుణంగా పోలీస్ శాఖలో మార్పు వచ్చిందని... రెవెన్యూ శాఖ కూడా ఆ తీరుగా మార్పును అలవరుచుకోవాలని సూచించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) ప్రతినిధులతో శనివారం(సెప్టెంబర్ 12) సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
రెవెన్యూ ఉద్యోగులపై ప్రశంసలు...
రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అధికారులు పూర్తిగా సహకరించాలని... వారి సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ సూచించారు. ప్రజలు కేంద్రబిందువుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని.... అందులో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలు,ప్రకృతి విపత్తులు,ఇలా మొత్తంగా 53 రకాల బాధ్యతలను రెవెన్యూ ఉద్యోగులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లోని ప్రమోషన్స్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ట్రెసా మద్దతు..
కొత్త రెవెన్యూ చట్టానికి ట్రెసా పూర్తి మద్దతు తెలిపింది. ఈ చట్టం అమలుకు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొంది. తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించడంపై ధన్యవాదాలు తెలిపింది. సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని... ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ట్రెసా ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూ పరిపాలనా కమిషనర్ పోస్టును భర్తీ చేయాలని కోరారు.
Recommended Video
వీఆర్వోల విజ్ఞప్తులు..
అర్హులైన వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ట్రెసా ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. అర్హులకు పదోన్నతులు కల్పించాలన్నారు. రెవెన్యూ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ట్రెసా ప్రతినిధుల విజ్ఞప్తులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.