ఉరి వేసుకుని హైదరాబాద్లో చెన్నై టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నగరంలో చోటు చేసుకుంది. ఎస్సై జేమ్స్ బాబు తెలిపిన వివరాల కథనం ప్రకారం... చెన్నైకి చెందిన ఎం శివకుమార్ (35) మూడు నెలలుగా శివపురిలో ఒంటరిగా ఉంటున్నారు.
అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే, అతను గురువారం ఉదయం 11 గంటలు దాటినా బయటకు రాలేదు. అనుమానంతో ఇంటి యజమాని జయంతి చూడగా, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది.
వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
హుస్సేన్సాగర్ నాలాలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. గురువారం ఉదయం నాలాలో నీటి ప్రవాహానికి ఓ మృతదేహం కొట్టుకొచ్చిందని స్థానికులు నారాయణగూడ పోలీసులకు సమాచారాన్ని అందించారు.
పోలీసులు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. పాయింట్ జేబులో లభించిన డ్రైవింగ్ లైసెన్స్లోని వివరాల ప్రకారం.. అతని పేరు మహ్మద్ ఖయ్యూమ్గా, ఆటో డ్రైవర్గా చేస్తూ కింగ్కోఠిలో నివాసముంటున్నట్లుగా తెలిసింది.
తాగిన మత్తులో మూత్రవిసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో జారి పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై నాగార్జునరెడ్డి 174 సెక్షన్ కింద కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.