విషాదం: ఫ్యామిలీకి ఉరేసుకుంటూ సెల్ఫీ పంపిన సివిల్స్ అభ్యర్థి
వరంగల్: ఆ యువకుడు సివిల్స్ సాధించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు, కానీ, అతడ్ని ఒంటరితనం కుంగదీసింది. ఈ క్రమంలో అతడు తన మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురంలోని లక్ష్మిపురంలో చోటుచేసుకుంది.
మామునూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండకు చెందిన రాజరికపు కృష్ణమోహన్(31) గత కొంత కాలంగా లక్ష్మీపురం వద్ద అద్దె భవనంలో ఒంటరిగా ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యాడు. మంగళవారం ఉదయం తాను చనిపోతున్నానంటూ హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులకు తన మొబైల్ ఫోన్లో సమాచారం ఇచ్చాడు.
ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు కృష్ణమోహన్ కోసం లక్ష్మిపురంలో ఆరా తీశారు. పోలీసులు ఇంటి చిరునామా తెలుసుకొని వచ్చే లోపే ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కృష్ణమోహన్.
పోలీసులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన వరంగల్కు చేరుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, ఒంటరితనం బాధించి చనిపోతున్నానని కృష్ణమోహన్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగం సంపాదించి ఉన్నత జీవితం గడుపుతాడనుకున్నామని, ఇలా అర్ధాంతరంగా తమను వదిలివెళ్తాడనుకోలేదని కుటుంబసభ్యులు విలపించారు.