వేధిస్తున్నారు: మాజీ మంత్రి శంకర్రావుపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావుపై మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో తన 40 ఎకరాల భూమి ఆక్రమించుకుని వేధిస్తున్నారని శ్రీనివాసరావు అనే వ్యక్తి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. తనను వేధింపులకు గురి చేస్తున్న శంకర్రావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, తనపై వచ్చిన భూకబ్జాల ఆరోపణలు అవాస్తమని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూకబ్జాలకు తను ఎప్పుడు పాల్పడలేదన్నారు. వాటికి సంబధించిన డాక్యుమెంట్లు తన దగ్గర ఉన్నాయని వివరించారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు సొంత పార్టీలోని కొందరు ప్రయత్నిస్తున్నారని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు
తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. 650 శాంపిల్స్లో 21 మందుల్లో నాణ్యతలోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మందుల నాణ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని డీసీఏ అధికారి అకున్ సబర్వాల్ తెలిపారు.
టీఎస్ఎంఎస్ఐడీసీ ఈడీగా సుమన్చంద్రా!
తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పోస్టు కోసం ఉస్మానియా ప్రొఫెసర్ సుమన్చంద్రా పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇటీవల టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా ఆర్ వేణుగోపాల్ను నియమించారు. ప్రస్తుతం ఈడీగా సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి ఉన్నారు. పెద్ద ఎత్తున ఆస్పత్రుల స్థాయి పెంపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎక్విప్మెంట్, సర్జికల్, డ్రగ్స్ కొనుగోళ్లపై అవగాహన ఉన్న ఉస్మానియా రేడియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుమన్చంద్రా పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ మెడికల్ కాలేజీని సుమన్చంద్రానే ప్రారంభించారు. మొదటి ఇన్చార్జి ప్రిన్సిపల్గా కూడా ఆయన పనిచేశారు.
మద్యం షాపుపై ఎక్సైజ్ శాఖ దాడులు
మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం పొన్నాలలోని మద్యం షాపుపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. కల్తీ మద్యం అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. షాపులో రూ. 1.50 లక్షల కల్తీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం షాపును సీజ్ చేశారు.