రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఏకే47తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
Recommended Video
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్లో విశ్రాంత ఐపీఎస్ ఆర్పీ మీనా ఇంటి ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశారు. పశ్చిమ మండల అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం... జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో ప్లాట్ నంబరు 250లో విశ్రాంత ఐపీఎస్ ఆర్పీ మీనా నివసిస్తున్నారు.
గన్మెన్ డ్యూటీలో నిజామాబాద్కు సంబంధించిన ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో ఇద్దరు సీఆర్ హెడ్ క్వార్టర్కు సంబంధించిన కానిస్టేబుళ్లు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఏఆర్ కానిస్టేబుల్ కిషోర్బాబు విధుల్లో ఉన్నారు.
శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు మీనా విమానాశ్రయానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఇంటి ముందు గన్మెన్లు గంగాధర్, ఇజ్రాయిల్తోపాటు కిషోర్ ఉన్నారు. గన్మెన్లు తమ దగ్గర ఉన్న ఏకే 47 తుపాకులను సెంట్రీ ఫోర్స్లో పెట్టారు.
కాగా, కిషోర్ ఒక్కసారిగా సెంట్రీఫోర్స్లో ఉన్న ఇజ్రాయిల్కు సంబంధించిన ఏకే 47 తుపాకీని తీసుకొని ఎడమ వైపు ఛాతీపై ఒక రౌండ్ కాల్చుకున్నారు. తూటా శరీరంలో నుంచి బయటకు వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. తుపాకీ పేలుడు శబ్దం విన్న మీనా ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చారు. డ్రైవరు శ్రీనివాస్, కానిస్టేబుల్ ఇజ్రాయిల్ కలిసి కిషోర్ను హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. భయపడాల్సిన పని లేదని చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పారు.
కిషోర్బాబు బేగంటపేట పోలీసు క్వార్టర్స్లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ తన తండ్రికి కిషోర్బాబు 7 పేజీల లేఖను రాశారు. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యాఘటనపై పోలీసులు సెక్షన్ 309 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.