ప్రేమ పెళ్లి.. కానిస్టేబుల్ హత్య.. : అసలేంటీ కథ..?
తాండూరు : ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం పెద్దలను సైతం ఎదిరించిన ఓ యువ కానిస్టేబుల్ తీరా పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం పంథా మార్చాడు. పెళ్లికి తల్లిదండ్రుల అభ్యంతరాన్ని సైతం లెక్క చేయనివాడు, పెళ్లి తర్వాత మాత్రం అదే తల్లిదండ్రులతో కలిసి భార్యపై వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపుల పర్వం చివరికి ఆమెను హత్య చేయడంతో ముగియగా, అతని ఉచ్చులో చిక్కుకున్న అమాయకురాలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన మహేశ్ (26), జహీరాబాద్ కు చెందిన మంజుల (24) పటాన్ చెరు పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తించేవారు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీయడంతో మహేశ్ తల్లిదండ్రల అభ్యంతరాలను సైతం పక్కనబెట్టి పెళ్లి చేసుకున్నారు.
అయితే అంతకుముందే మహేశ్ కు అతని తల్లిదండ్రలు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిపించారు. మంజుల కోసం నిశ్చితార్ధాన్ని సైతం రద్దు చేసుకుని ఆమెను స్థానికంగా ఉన్న ఓ గుడిలో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందు మంజులనే తన ప్రాణం అన్నట్టుగా వ్యవహరించిన మహేశ్ పెళ్లయ్యాక ప్లేటు ఫిరాయించాడు.
తల్లిదండ్రలతో కలిసి మంజులను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గతంలో రాంచంద్రాపురం పోలీసులు కూడా దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించినా మహేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే క్రమంలో గత నెల 23న మంజుల ఇంట్లో నిద్రపోతున్న సమయంలో టవల్ తో ఆమె ముక్కు, నోరు గట్టిగా మూసేసి ఊపిరాకుండా చేసి ఆమెను హత్య చేశాడు.
యాక్సిడెంట్ గా చిత్రీకరణ..
హత్యానంతరం మంజులను ఓ ఆటోలో తీసుకెళ్లి తాండూరు-గాజీపూర్ రోడ్డుపై పడేసి రోడ్డుపై పడేసి యాక్సిడెంట్ లో తన భార్య మరణించినట్టుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం అంగీకరించిన మహేశ్ కటకటాల పాలయ్యాడు.