గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా బాధితుడి పరారీ: పోలీసుల గాలింపు
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడు పారిపోవడం కలకలంగా మారింది. గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి ఆదివారం రాత్రి గద్వాలకు చెందిన ఓ కరోనా బాధితుడు పారిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.
కరోనా బాధితుడి కోసం గాలింపు..
పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుడి ఆచూకీ కోసం చిలకలగూడ పోలీసులతోపాటు గద్వాల పోలీసులు గాలిస్తున్నారు. కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఇటీవల ఆ బాధితుడిని గద్వాల నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒకే రోజులో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 332కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి వెల్లడించింది. మొత్తం 32 మంది పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 289 ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. జిల్లాలా వారీగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. హైదరాబాద్లో అత్యధికంగా 139 కేసులు నమోదవగా.. తర్వాతి స్థానంలో 23 కేసులతో వరంగల్ అర్బన్ జిల్లా ఉంది.
నిజామాబాద్ జిల్లాలో 19, నల్గొండలో 13, మేడ్చల్ 12, ఆదిలాబాద్ 10, కామారెడ్డి 8, కరీంనగర్ జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.
విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచన
ఇది ఇలావుండగా, కరోనా లాక్ డౌన్ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఆన్ లైన్ పాఠాలు టీ-సాట్ విద్య, నిపుణ ఛానళ్ల ప్రసారాలు కేబుల్ నెట్ వర్క్స్ ద్వారా, టీశ్యాట్, టీవ, లేదా యూట్యూబ్/టీఎస్ నెట్ వర్క్, టీశాట్ మొబైల్ యాప్లో ఇవి అందుబాటులో ఉంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది ఇలావుండగా, రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266కు పెరిగింది. దేశంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం నాటికి 4067కే కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 109కి చేరింది. ప్రస్తుతం 3666 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 292 మంది కరోనా నుంచి కోలుకున్నారు.