హృదయ విదారకం: కూతురు కళ్లెదుటే దంపతుల ఆత్మహత్య, ‘అమ్మ కావాలంటూ’
Recommended Video
మెదక్: జిల్లాలోని తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువారం ఉదయం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పది నెలల కుమార్తె కళ్లెదుటే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నారిని రైల్వే ఫ్లాట్ ఫాంపై కూర్చోబెట్టి వీరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
చిన్నారి ముందే..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న దంపతులు తమ పది నెలల చిన్నారిని రైల్వే ఫ్లాట్ ఫాంపై కూర్చోబెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆధార్ ఆధారంగా గుర్తింపు
స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డుల ఆధారంగా వారిని ఒంటెద్దు కాశీరాం దంపతులుగా గుర్తించారు. వీరు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ వాసులని తెలిపారు.
అమ్మ కావాలి అంటూ చిన్నారి
కాగా, తల్లిదండ్రులు చనిపోవడంతో ఏం జరిగిందో తెలియని చిన్నారి ‘అమ్మ' కావాలి అంటూ తీవ్రంగా ఏడుస్తోంది. ఈ దృశ్యం అక్కడున్న వారి హృదయాలను కలిచివేస్తోంది.
చిన్నారి అప్పగింత కోసం..
దంపతుల మృతదేహాలను కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఆ చిన్నారిని తెలిసిన వారికి అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతుల బంధువులు ఎవరైనా చిన్నారి కోసం తమను సంప్రదించాలని కోరుతున్నారు.