షాక్: కొడుకు మృతి, కోడలిని రూ.1.80లక్షలకు అమ్మేసిన అత్తామామ
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకు చనిపోయాడని, కోడలిని అమ్మేశారు ఆమె అత్తా మామ, బావ. ఈ ఘటన జిల్లాలోని నేరేడుగొండ మండలం కిష్టాపూర్లో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్: జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకు చనిపోయాడని, కోడలిని అమ్మేశారు ఆమె అత్తా మామ, బావ. ఈ ఘటన జిల్లాలోని నేరేడుగొండ మండలం కిష్టాపూర్లో చోటు చేసుకుంది.
లలిత అనే మహిళ గత కొంత కాలం క్రితం కిష్టాపూర్కు చెందిన ఓ యువకుడితో వివాహమైంది. వారికి ఒక కూతురు కూడా ఉంది. అయితే, కూతురు పుట్టిన కొంత కాలానికే లలిత భర్త చనిపోయాడు. ఆ తర్వాత తమ మనవరాలిని తమ వద్దే ఉంచుకున్న ఆమె అత్తామామలు, బావ.. లలితను గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారికి అమ్మేశారు.
ఇందుకు రేఖ అనే మహిళ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలిసింది. కాగా, లలితను రూ.1.80లక్షలకు అమ్మేయడం గమనార్హం. కాగా, గుజరాత్ వ్యాపారి పెట్టే వేధింపులు భరించలేక లలిత తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది.
దీంతో లలిత సోదరుడు, ఆమె తల్లి నేరేడుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లలిత జాడను తెలియజేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. కాగా, లలిత అత్తామామల వద్ద ఉన్న ఆమె కూతురును తీసుకొచ్చుకున్నారు లలిత తల్లి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.