కరోనా ఎఫెక్ట్ : 'కేసీఆర్ తాతా కనికరించవా... ఒకేసారి అన్ని ఇబ్బందులు..'
కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఖజానాపై ప్రతికూల ప్రభావం పడింది. అన్ని రంగాల్లో దాదాపుగా పనులు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు.. ఏప్రిల్ నెల ఇచ్చే జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు,ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కూరపాటి సత్యప్రకాశ్ రావు అనే టీచర్ కుమార్తె కూరపాటి లాస్య ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ప్లకార్డు ద్వారా నిరసన తెలిపింది.
'అమ్మా నాన్న టీచర్లు. ఫిబ్రవరిలో ఇన్కమ్ ట్యాక్స్.మార్చిలో 50శాతం వేతనం కోత. అమ్మ చనిపోయింది. ఒకేసారి ఇన్ని ఇబ్బందులు. కేసీఆర్ తాతా కనుకరించవా..' అంటూ లాస్య ప్లకార్డులో పేర్కొంది. లాస్య తల్లి సునీత ఫిబ్రవరి 22న మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా బాధ నుంచి తేరుకోక ముందే.. ఇలా జీతాల్లో కోతపెట్టి మరిన్ని ఇబ్బందులకు గురి చేయవద్దునని లాస్య తండ్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. లాస్య ప్లకార్డు ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.
కాగా,ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75శాతం,సివిల్ సర్వీస్ ఉద్యోగుల వేతనాల్లో 60శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50శాతం మేర తెలంగాణ ప్రభుత్వం కోతలు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే గ్రేడ్-4,కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో 10శాతం కోత పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల ఫించన్లలోనూ 50శాతం కోత పెట్టింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీఎస్డీపీ రూ.4.05లక్షల నుంచి రూ.5.50లక్షలకు పెరిగిందని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం.. 12 రోజులకే జీతాలివ్వలేని స్థితికి వెళ్లిందా? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే దాతలు ఇచ్చిన విరాళాలే ఎక్కువ అని అన్నారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదని సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఓవైపు వేతనాల్లో కోతలు పెడుతూ.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.22వేల కోట్లకు టెండర్లు పిలవడం ఎంతవరకు సబబు అని మరో సీనియర్ నేత దామోదర రాజనరసింహ ప్రశ్నించారు. ఆర్థిక దివాళకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించారని దాసోజు శ్రవణ్ విమర్శించారు