గాంధీ ఆస్పత్రిలో భారీ స్కాం: సీనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం, పొట్టచుట్టూ పెట్రోల్ బాటిళ్లు, లైటర్తో
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ వసంత్ ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు గురిచేశారు. కరోనావైరస్పై తప్పుడు సమాచారం ఇచ్చారని, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కరోనావైరస్ లీకేజీ వ్యవహారంలో తనను బలి చేశారంటూ మండిపడ్డారు. తన ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యవహారంలో డాక్టర్ వసంత్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
పొట్టచుట్టూ బాటిళ్లు పెట్టుకుని.. లైటర్తో..
ఈ నేపథ్యంలో పొట్ట చుట్టూ పెట్రోల్ బాటిళ్లు పెట్టుకుని, చేతిలో లైటర్తో డాక్టర్ వసంత్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో నిల్చున్నారు. తన వద్దకు వస్తే నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడతానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అతని వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని గట్టిగా పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న పెట్రోల్ బాటిళ్లను తీసేసి.. అతడ్ని నీటితో తడిపేశారు. ఆ తర్వాత అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మూడు గంటల హైడ్రామాకు తెరపడినట్లయింది.
కుట్రలు, నిధుల గోల్ మాల్..
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా ఉన్న రమేష్ రెడ్డి కుపూరితంగా వ్యవహరిస్తున్నారరని, తనకు అనుకూలంగా ఉన్నవారికి డ్యూటీలు చేయకున్నా జీతాలు వచ్చేలా చూస్తున్నారని ఆరోపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ గా ఉన్న శ్రవణ్ కూడా నిధులు గోల్ మాల్ చేసేందుకే పని చేస్తున్నారని, ఆప్పత్రికి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఈఎస్ఐ కంటే భారీ స్కాం.. మంత్రిని కలిసినా..
కాగా, కరోనా వైరస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం తనను బలి చేసిందని డాక్టర్ వసంత్ ఆరోపించారు. మంత్రి ఈటెల రాజేందర్ను కలిసి గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలపై వివరించినట్లు తెలిపారు. ఆయన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటామని, పరిశీలిస్తామని చెప్పారని తెలిపారు. అయితే, తనకు మంత్రి నుంచి ఎలాంటి హామీ లభించలదేని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు సమయానికి ఆస్పత్రికి రారని, సెలవుల్లో ఉండి కూడా జీతాలు తీసుకుంటారని డాక్టర్ వసంత్ ఆరోపించారు. ఈఎస్ఐ స్కాంటే పెద్ద స్కామే జరిగిందని ఆరోపించారు. ఆస్పత్రి అవినీతిమయంగా మారిందన్నారు. డాక్టర్ల అసోసియేషన్ కూడా ఈ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం లేదని మండిపడ్డారు. కాగా, వసంత్ భార్య కూడా గాంధీలోనే వైద్యురాలిగా ఉన్నారు.
ఉన్నతాధికారులు.. ఇతర డాక్టర్ల మాట..
డాక్టర్ వసంత్ ఆత్మహత్యాయత్నంతో ఆస్పత్రిలోని సిబ్బంది, వైద్యులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకోవడం పరిస్థితి కుదుటపడింది. ఆత్మహత్యలాంటి చర్యలను తాము సమర్థించబోమని తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రమేష్ రెడ్డి స్పందిస్తూ.. డాక్టర్ వసంత్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని చెప్పారు. కరోనావైరస్ లాంటి కీలక విషయంలో ఆయన ప్రవర్తన సరిగా లేదని చెప్పారు. గాంధీ ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించారని తెలిపారు.