విషాదం: మద్యం మత్తులో 3నెలల కొడుకు ప్రాణం తీసిన తండ్రి
నిర్మల్: మద్యం మత్తులో కన్న కొడుకు ప్రాణాలు తీశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక పద్మావతినగర్ కాలనీకి చెందిన షేక్గౌస్, రిహానాబేగంలకు 3నెలల చిన్నారి రిజ్వాన్ ఉన్నాడు. నవంబర్ 28న రిజ్వాన్కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. రిహానా అతడ్ని స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లింది.
అయితే, బాలుడిని బయటికి ఎందుకు తీసుకెళ్లావంటూ షేక్ గౌస్ భార్యతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఊయలలోని బాలుడిని కింద పడేశాడు. దీంతో చిన్నారి తలకు, మెడకు గాయమైంది. దీంతో ఆస్పత్రిలో చూపించేందుకు డబ్బులు లేక రిహానా తన తల్లిగారి ఊరైన జగిత్యాల జిల్లా మల్లాపూర్కు వెళ్లింది.
సోదరుడి వద్ద డబ్బులు తీసుకుని నవంబర్ 29న నిర్మల్ ఆస్పత్రిలో చూపించింది. మందులు వాడినా చిన్నారికి నయం కాలేదు. నవంబర్ 30న చిన్నారి పాలు తాగడం లేదని జగిత్యాలలోని ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్తున్న క్రమంలో పరిస్థితి విషమించి, మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందాడు. రిజ్వాన్ మృతికి తన భర్తే కారణమన్న రిహానా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.