కెసిఆర్ మేనల్లుడిని..నన్నే నిలదీస్తారా?: పోలీస్ స్టేషన్లో ఉద్యోగి బీభత్సం
మెదక్: మద్యం మత్తులో ఉన్న ఓ ఉద్యోగి ఏకంగా తాను తెలంగాణ ముఖ్యమంత్రి మేనల్లుడినంటూ పోలీస్ స్టేషన్లో హంగామా చేశాడు. అంతేగాక, తననే ప్రశ్నిస్తారా? అంటూ ఓ కానిస్టేబుల్పై దాడికి యత్నించాడు. ఆ తర్వాత అతడి గురించి తెలుసుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట హెడ్ పోస్టాఫీసులో ఏపీఎం కొండల్రావు అదివారం సాయంత్రం తాగిన మైకంలో పట్టణ శివారులోని రూరల్ పోలీసుస్టేషన్లోకి వెళ్లి స్టేషన్ ప్రధాన ద్వారం ఎదురుగా బైక్ అపాడు. దీంతో కానిస్టేబుల్ నరహరి అందుకు అభ్యంతరం చెప్పారు.
ఈ క్రమంలో కొండల్రావు రెచ్చిపోయాడు. 'నేను సీఎం కేసీఆర్ మెనల్లుడిని. నన్నే ప్రశ్నిస్తారా?' అంటూ దుర్భాషలాడాడు. స్టేషన్లోకి వెళ్లి ఏఎస్ఐ బుచ్చయ్య, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'ఏం రా.. సీఎం కేసీఆర్ మేనల్లుడిని. నన్నే ప్రశ్నిస్తాడా? మీ కానిస్టేబుల్. మీరెంత. మీ బతుకెంత. 44శాతం జీతాలు అధికంగా తీసుకుంటున్నారు..' అంటూ బూతులు తిట్టాడు. దీంతో సెంట్రీ కానిస్టేబుల్ అమృత్రావు ఆయనను సముదాయించే ప్రయత్నం చేస్తుండగా అతడిపై దాడి చేశాడు.
సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి అతడు పోస్టల్ ఉద్యోగి అని గుర్తించారు. దీంతో పోలీసులు అప్పటికప్పుడు కొండల్రావును అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉండటంతో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.