రూ. కోటి నగదుతో పరారైన బ్యాంక్ ఉద్యోగి: ఖాతాదారుల ఆందోళన
జిల్లాలోని నేరేడ్మెట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగి భారీ దోపిడీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోని రూ. కోటి నగదుతో బ్యాంక్ ఉద్యోగి సుధాకర్ రెడ్డి ఉడాయించాడు.
మేడ్చల్: జిల్లాలోని నేరేడ్మెట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగి భారీ దోపిడీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోని రూ. కోటి నగదుతో బ్యాంక్ ఉద్యోగి సుధాకర్ రెడ్డి ఉడాయించాడు. రెండు రోజులుగా ఉద్యోగి పరారీలో ఉన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, బ్యాంక్ మేనేజర్ గానీ, సిబ్బందిగానీ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఖాతాదారులు నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సదరు బ్యాంక్ ఉద్యోగి సుధాకర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
కారులో ఎక్కించుకుని దోపిడీ
ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకొని మార్గమధ్యంలో అతనిపై దాడి చేసి నగదు, మొబైల్ ఫోన్ లాక్కొని పరారైన నలుగురు దొంగలను గురువారం శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.40 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా, చర్లపల్లికి చెందిన సబావత్ నరేందర్నాయక్, విస్లావత్ రమేశ్నాయక్, భానుప్రకాష్, తిరుపతిరాజులు జల్సాల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డారు.
కడప జిల్లా, పొద్దుటూర్కు చెందిన షేక్ షావలీ వ్యాపార నిమిత్తం ఈనెల 1న హైదరాబాద్కు వచ్చాడు.తనకు రావాల్సిన రూ.40వేలు వసూలు చేసుకొని అదేరోజు ఇంటికి వెళ్లడానికి రాత్రి ఆరాంఘర్ బస్టాప్ వద్ద ఎదురు చూస్తున్నాడు.ఆ సమయంలో కారులో సదరు నలుగురు వచ్చారు. షావలిని ఎక్కడికి వెళ్లాలని అడిగి తామూ కడపకు వెళ్తున్నామని ఎక్కించుకున్నారు.
శంషాబాద్, పెద్దషాపూర్ సమీపంలోని బురుజుగడ్డ తండా నిర్జన ప్రదేశంలో కారు ఆపి షావలిపై దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.40వేల నగదు, స్మార్ట్ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు స్మార్ట్ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా సిగ్నలింగ్పై నిఘా పెట్టారు.ఉప్పల్కు చెందిన దిలిప్కు మొబైల్ ఫోన్ విక్రయించారు. కాగా, దిలీప్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ దొంగల బండారం బయట పడింది.