విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని కందుగుల గంగిరెద్దుల కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్ మండలంలోని కందుగుల గంగిరెద్దుల కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గంగిరెద్దుల కాలనీకి చెందిన ఘంటా కొమరయ్య(36)కు హుస్నాబాద్ మండలం కొండాపూర్కు చెందిన కొమరమ్మ(34)తో కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఎల్లమ్మ(10), కొమరమ్మ(8), అంజమ్మ(6) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇటీవల కొమరయ్య మంత్రాలు, చేతబడులు చేస్తున్నాడనే నెపంతో కొమరమ్మ పుట్టింటి వారు అతడి కుటుంబాన్ని హుస్నాబాద్కు పిలిపించి వారిపై దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన కొమరయ్య దంపతులు ఆదివారం రాత్రి ముందు పిల్లలకు ఉరి వేసి అనంతరం వారు ఉరేసేకుని బలవన్మరణం పొందారు.
సోమవారం ఉదయం వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ సీఐ రమణమూర్తి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కాగా, మంత్రి ఈటెల రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.