హోటల్లో టేబుల్స్ తుడుస్తున్న ఓ అన్నదాత..! ఆదుకోని రైతు బంధు..!!
సంగారెడ్డి/ హైదరాబాద్ : రైతు కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా అవి క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా అన్నదే సందేహంగా మారింది. పంట పండించడానికి పెట్టుబడి సాయం కింది నేరుగా రైతు ఎకౌంట్ లోకి నగదు వేస్తున్నప్పటికి పంట నష్టం పేరుతో రైతుల ఆత్మహత్యల పరంపరకు మాత్రం బ్రేకులు పడడం లేదు. కొన్ని గ్రామాల్లో వ్యవసాయాన్ని వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్నదాతలు అన్వేషించడం మరీ దానుణంగా పరిణమించింది.
సంగారెడ్డి లో ఇలాంటి ఉందంతమే వెలుగులోకి వచ్చింది.మెదక్ జిల్లా పిట్లం మండలం బోదిగామ గ్రామానికి చెందిన మల్లి పోచయ్యది మరో విషాద గాధ. ఈయన ఓ రైతు. తన పేరు మీద రెండెకరాల పట్టా భూమి ఉన్నా ఓ హోటల్లో కూలి పని చేస్తూ జీవనం వెళ్ల దీస్తున్నాడు. నమ్ముకున్న వ్యవసాయం అప్పులనే మిగిల్చడంతో ఆయనకు ఈ కష్టమొచ్చింది.
రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్లక్ష్యం..!
చాలా ఏళ్లుగా తన గ్రామంలో పోచయ్య వ్యవపాయాన్నే నమ్ముకున్నాడు. పోచయ్య దంపతులకు పిల్లలు లేరు. ఈ దిగులుతోనే ఆయన భార్య మంచం పట్టి కొన్నాళ్ల క్రితం చనిపోయింది. ఇటీవల పోచయ్య 30వేల రూపాయలు అప్పు తెచ్చి మక్క పంట సాగు చేశాడు. వర్షాలు లేక పంటంతా ఎండిపోయింది. చేసిన రుణానికి వడ్డీ పెరిగిపోతుండడంతో పోచయ్య ఆందోళన చెందాడు.
ఎటూ పాలుపోని పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చాడు. అక్కడ రోజువారీ కూలీగా పనిచేస్తూ పొట్ట పోసుకుంటున్నాడు. అప్పు తీర్చేందుకు కూలి డబ్బులను దాచుకుంటున్నానని చెప్పాడు. తొలి విడతలో రైతుబంధు ద్వారా వచ్చిన 4వేలు తన భార్య వైద్యానికి ఖర్చయి పోయాయని, మళ్లీ ఖాతాలో వేస్తామన్న పైసలు ఇంత వరకు పడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు పోచయ్య.