వెనక్కి తగ్గితే లక్ష జరిమానా..! ఎంపీ కవితకు పోటీగా బరిలో రైతుల తీర్మానం..!!
నిజామాబాద్/హైదరాబాద్ : కడుపు మండిన పసుపు, ఎర్రజొన్న పంట రైతులు పదుల సంఖ్యలో తమ నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు 245 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చివరి రోజు అయిన సోమవారం నాడే 182 నామినేషన్లు దాఖలు అయ్యాయంటే అన్నదాతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది. గ్రామస్థులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, డబ్బులు జమ చేసి నామినేషన్ వేయాల్సిన అభ్యర్థులను ఖరారు చేశారంటే పాలక టీఆర్ఎస్ పార్టీపై ఎంత కోపంతో ఉన్నారో స్పష్టమవుతోంది. నామినేషన్ పత్రాలను అడ్వకేట్లు, నిపుణులతో పరిశీలింప చేయించి రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గ్రామస్థులకు సమాచారం ఇవ్వకుండా, తెలియచేయకుండా నామినేషన్ విత్ డ్రా చేస్తే సదరు వ్యక్తి పై 1 లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. లక్ష రూపాయల జరిమానా చెల్లించిన తరువాతే గ్రామంలో అడుగుపెట్టాల్సి ఉంటుందని తీర్మానం చేశారు.
నిజామాబాద్ లో రికార్డ్ స్థాయిలో నామినేషన్లు...ఇది ప్రభుత్వంతో రైతన్నల వార్
మొత్తం 245 నామినేషన్ల దాఖలు..! పట్టుదలగా ఉన్న రైతులు..!!
నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించాలని కొన్నేళ్ల నుంచి రైతులు పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని, మద్దతు ధర పెంచుతామని స్థానిక పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చేసిన హామీలు హామీలుగానే మిగిలిపోవడం రైతులు జీర్ణించుకోలేకపోయారు. పసుపుకు మద్దతు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని పదేళ్ల క్రితం కవిత పలు సభల్లో ప్రకటించారు. మద్దతు ధర ప్రకటించకపోయినా బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించలేకపోయారు.
ఎంపి కవితపై కస్సు మంటున్న రైతులు..! వినూత్నంగా నిరసన తెలుపుతున్న రైతన్నలు..!!
గత ఎన్నికల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పిన ఓట్లేసిన తరువాత మరిచిపోయారు. పండిచిన చెరకును దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళక తప్పడం లేదు. పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకువెళ్ళేందుకే అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశామంటున్నారు. అధికార పార్టీపై తమ కసిని తీర్చుకునేందుకు పార్లమెంటు ఎన్నికలకు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం గడువు ముగిసే నాటికి సుమారు 245 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో ప్రధాన పార్టీల నామినేషన్లు పదిలోపే ఉండగా మిగితా 235 నామినేషన్లు రైతులవే కావడం గమనార్హం.
గతంలో ఫ్లోరైడ్ సమస్యతో వందల సఖ్యలో నామినేషన్లు..! ఇప్పుడు రైతుల ఆగ్రహం..!!
గతంలో నల్లగొండ జిల్లాలో జల సాధన సమితి నాయకులు కూడా ఇలాగే నామినేషన్లు దాఖలు చేశారు. ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి కల్పించడంలో ప్రజా ప్రతినిధులు విఫలం కావడంతో వందల సంఖ్యలో రైతులు నామినేషన్లు వేశారు.శుక్రవారం తమ నామినేషన్లను స్వీకరించకుండా ఎన్నికల అధికారులు ముప్పు తిప్పలు పెట్టారని రైతులు విమర్శించడంతో పాటు ధర్నాకు దిగడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు నిజామాబాద్ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి సోమవారం నామినేషన్ కోసం వచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయడం విశేషం.
ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుబులు..! కర్తవ్యం ఏంటని సమాలోచనలు..!!
జిల్లా వ్యాప్తంగా ఉన్నా రెవెన్యూ అధికారులను పిలిపించారు. రైతుల నామినేషన్ పత్రాలను వెంటవెంటనే పరిశీలించి రిటర్నింగ్ అధికారి వద్దకు పంపించారు. సాయంత్రం 3 గంటలలోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోపల ఉన్న వారందరికీ అవకాశం కల్పించారు. రాత్రి 11 గంటల వరకు రైతులు కార్యాలయంలోనే ఉన్నారు. రైతులందరూ ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు అప్పుడే గుబులు మొదలైట్టు చర్చ జరుగుతోంది. పరిశీలన, విత్ డ్రా పైనే వారు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.