వీడియో: రాజధాని ఎక్స్ప్రెస్ రైలింజిన్లో మంటలు: వికారాబాద్ జిల్లాలో ఘటన
వికారాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తోన్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలింజిన్లో మంటలు చెలరేగాయి. లోకో పైలెట్లు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదాన్ని నివారించగలిగారు.. ఈ ఘటనలో లోకో పైలెట్లు, ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ఎవరూ గాయపడ లేదు. మంటలు చెలరేగిన రైలింజిన్ నుంచి బోగీలను వేరు చేశారు. మరో ఇంజిన్ను అమర్చి బెంగళూరుకు పంపించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది.
ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన రాజధాని ఎక్స్ప్రెస్ మార్గమధ్యలో వికారాబాద్ జిల్లాలోని నవాంద్డీ స్టేషన్ వద్దకు చేరుకున్న వెంటనే రైలింజిన్ నుంచి పొగ వెలువడింది. దాన్ని గమనించిన వెంటనే లోకో పైలెట్లు అప్రమత్తం అయ్యారు. రైలును నిలిపివేశారు. ఆ వెంటనే స్వల్పంగా మంటలు చెలరేగాయి. లోకోపైలెట్లు ఈ సమాచారాన్ని సమీప రైల్వేస్టేషన్కు చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంజిన్ నుంచి బోగీలను వేరు చేశారు. మరో ఇంజిన్ను అమర్చి బెంగళూరుకు పంపించారు.
మంటలను ఆర్పివేయడానికి రైల్వే, అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఇంజిన్ కిటికీ అద్దాలను పగులగొట్టి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.. మంటలు చెలరేగిన వెంటనే ఇతర అవి బోగీలకు వ్యాపించకుండా ప్రయాణికుల బోగీలను ఇంజిన్ నుంచి వేరు చేసినట్లు స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ ఇంజిన్ ఓవర్ హెడ్ నుంచి మంటలు వెలువడినట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ తెలిపారు.
వీడియో: రాజధాని ఎక్స్ప్రెస్ రైలింజిన్లో మంటలు: వికారాబాద్ జిల్లాలో ఘటన#Telangana #Vikarabad pic.twitter.com/FzyDEB806l
— oneindiatelugu (@oneindiatelugu) January 4, 2021