సంతానం కలిగిస్తానన్నాడు.. దెబ్బలకు హూనమైపోయాడు
ఖమ్మం : జనం వీక్ నెస్ ను క్యాష్ చేసుకునే మోసగాళ్లకు ఈరోజుల్లో కోకొల్లలు. మనిషి దగ్గర పలానా వీక్ నెస్ ఉందని తెలిస్తే.. మాయ మాటలతో బురిడీ కొట్టించి తమ జేబులు నింపేసుకోగలరు. ఇలాంటి ఖమ్మం జిల్లా ఇల్లందులోను చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సంతానం లేక బాధపడుతోన్న దంపతులు.. తనను సంప్రదిస్తే సంతానం కలిగే మందులు ఇస్తానని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన ఆయుధం సీతయ్య. అల్లోపతి మందుల కంటే.. తానిచ్చే మందుల వల్ల సంతానం త్వరగా కలుగుతుందని నమ్మ బలుకుతాడు.
ఈ నేపథ్యంలోనే.. సంతానం లేని దంపతులకు పిల్లలు పుట్టే మందులు ఇస్తానని చెప్పి ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతంలో తిరుగుతున్నాడు. దీంతో సీతయ్యను నమ్మిన ఓ జంట రూ.3వేలు చెల్లించి అతనిచ్చిన మందులను తీసుకున్నారు. ఇంతకీ ఆ మందులేంటంటే.. గ్లూకాన్ డీ ప్యాకెట్లలో బూడిద కలిపి దాన్నే మందుగా ఇవ్వడం మొదలుపెట్టాడు. పరగడుపున ఆ మందును తీసుకుంటే సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుందని మాయ మాటలు చెప్పాడు.
ఆ మందులు ఎంతగా వాడినా.. ఫలితం లేకపోవడంతో.. ఫోన్ చేసి ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదొక సమాధానం చెప్తూ తప్పించుకునేవాడు. దీంతో మోసపోయామని తెలుసుకుని సైలెంట్ అయిపోయారు. ఇదే క్రమంలో రెండేళ్ల తరువాత సదరు సీతయ్య మళ్లీ అదే వీధిలో ప్రత్యక్షమయ్యాడు. గతంలో లాగే సంతాన భాగ్యం కలగజేస్తానంటూ మాయ మాటలు చెప్పడం గుర్తించారు.
ఇంకేముంది.. సీతయ్యను పట్టుకుని నిర్బంధించారు 24 ఫీట్ కాలనీ వాసులు. అనంతరం మోసపోయినవాళ్లంతా ఏకమై సీతయ్యకు దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.