జీహెచ్ఎంసీ తనిఖీల్లో మరో విస్తుపోయే నిజం: బేకరీ ఉత్పత్తుల్లో పశువుల కొవ్వు..
ఈ కొవ్వును బేకరీ ఉత్పత్తుల్లో వాడుతున్నట్లు గుర్తించారు. నిందితులు సైతం ఇదే విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: జంతువుల కళేబరాలతో నూనె తయారుచేసే దందాలు ఇదివరకు రాజధానిలో చాలానే వెలుగుచూశాయి. ఇదొక్కటే కాదు, నకిలీ కారం, కల్తీ పాలు.. ఇలా రకరకాల దందాలతో జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అనేక ముఠాల గుట్టు గతంలో బట్టబయలైంది.
ఇదే తరహాలో పశువుల కొవ్వును బేకరీలకు విక్రయిస్తున్న ఒక ముఠా ఒకటి తాజాగా పట్టుబడింది. పటాన్ చెరులోని శాంతినగర్ లో జీహెచ్ఎంసీ అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ గుట్టు రట్టయింది. పశుమాంసం కరిగించి కొవ్వుగా మారుస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కొవ్వును బేకరీ ఉత్పత్తుల్లో వాడుతున్నట్లు గుర్తించారు. నిందితులు సైతం ఇదే విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ వరుస దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో చాలావరకుహోటల్స్ నిర్ణీత ప్రమాణాలను పాటించకుండా.. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో వంటలు తయారు చేస్తున్నట్లు తేలింది. పాడైపోయి కుళ్లిన ఆహారపదార్థాలను సైతం వంటకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
జీహెచ్ఎంసీ తనిఖీల్లో ఎల్బీనగర్ లోని స్వాగత్ హోటల్ సహా మల్కాజ్ గిరి, బోడుప్పల్, తదితర ప్రాంతాల్లోని హోటల్స్ ప్రమాణాలు పాటించడం లేదని తెలియడంతో.. వాటికి భారీ జరిమానా విధించారు.