పెళ్లి చేయమంటే ప్రియుడ్ని ఠాణాలో వేశారు: యువతి ఆత్మహత్య
మధిర: ప్రేమించుకున్న తమకు పెళ్లి చేయమని ఆ ప్రేమ జంట పెద్దలను కోరింది. అందుకు వారు ఒప్పుకోలేదు. అంతటితో ఆగకుండా ఆ ప్రేమజంటను విడదీసి.. ప్రియుడ్ని అరెస్ట్ చేయించారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని మధిరలో చోటు చేసుకుంది.
మధిర మండలం బయ్యారం గ్రామంలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి... మధిర పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్లీనగరం శివారు బయ్యారం గ్రామంలో చిలకబత్తిన జ్యోత్స్న(17) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మధిరలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ యువతి.. దేశినేనిపాలెం గ్రామానికి చెందిన రాజు(23) అనే ఆటోడ్రైవర్ను ప్రేమించింది. వీరిద్దరు కొంతకాలం కిందట హైదరాబాద్ వెళ్లారు. జ్యోత్స్న తండ్రి స్వామినాథన్ తన కుమార్తె అపహరణకు గురైందని పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు హైదరాబాద్లో ఉన్న జ్యోత్స్న, రాజులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు.
జ్యోత్స్న మైనర్ కావడంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసుకోవచ్చని చెప్పారు. రాజును జైలుకు తరలించారు. తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించకపోవడం, ప్రియుడు జైలుపాలవడంతో జ్యోత్స్న తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.