నమ్మి బైక్ ఎక్కితే మిత్రుడే రేప్ చేశాడు: తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి బాధితురాలు
మహబూబ్నగర్: జిల్లాలోని మిడ్జిల్ మండలంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, తీవ్ర రక్తస్రావం కావడంతో బాధిత యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
వివరాల్లోకి వెళితే.. మసిగొండ్లపల్లికి చెందిన విద్యార్థిని(18) షాద్నగర్లో ఓపెన్ డిగ్రీ చదువుతోంది. బుధవారం ఉదయం మిడ్జిల్ కు వచ్చి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. అదే సమయంలో అటుగా వెళ్లున్న తన ఇంటర్ క్లాస్మేట్ అయిన మిడ్జిల్కు చెందిన ఆంజనేయులు చూసి ఇంటి దగ్గర దిగబెడతానని బైక్పై ఎక్కించుకున్నాడు.
ఆ తర్వాత జగబోయిన్పల్లి సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను అక్కడే వదిలి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. పొలాల నుంచి ఇంటికి వస్తున్న తండా వాసులు గమనించి ఆ యువకుడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
బాధితురాలిని 108 అంబులెన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కల్వకుర్తి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని మిడ్జిల్ పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.