మాయమాటలు చెప్పి యువతిపై రేప్: విద్యార్థినులకు హెచ్ఎం వేధింపులు
మెదక్: కొందరు ఉపాధ్యాయుల తీరుతో గురువులంటే నమ్మకం పోతోంది. తల్లిదండ్రుల తర్వాత చిన్నారులను మంచి ప్రవర్తనతో తీర్చిదిద్దాల్సిన వారు తమ బాధ్యతను మరచి కీచకులుగా మారిపోతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
నర్సాపూర్ మండలం ఆవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్కుమార్.. 6,7 తరగతులు చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ మేరకు విద్యార్థినుల ఫిర్యాదుతో వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేగాక, ఆ ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. గ్రామపెద్దలు అతడిని గదిలో ఉంచి తాళం వేశారు. గ్రామ సభ్యులందరి సమక్షంలో విచారణ జరిపిన అనంతరం పోలీసులకు అప్పగించారు. కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని నిందితుడు విజయ్ తెలిపాడు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
మానసిక వికలాంగురాలిపై రేప్
నల్గొండ: ఓ మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేతేపల్లి మండలం బొప్పారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓ మానసిక వికలాంగురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా.. అదే గ్రామానికి చెందిన చందా వెంకన్న(25) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి ప్రవేశించి, ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో వెంకన్న అక్కడనుంచి పరారయ్యాడు.
అక్కడకు వచ్చిన చుట్టుపక్కల వారికి బాధితురాలు సైగల ద్వారా విషయాన్ని చెప్పింది. దీంతో వారు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడంతో గురువారం సాయంత్రం కేతేపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.