మానస కాదు, మనోజ్: దశాబ్దం తర్వాత అబ్బాయిగా మారిన అమ్మాయి!
కరీంనగర్: ఆ అమ్మాయి నిన్నమొన్నటి దాకా.. నాలుగో తరగతి వరకూ అమ్మాయిల సరసన కూర్చొని చదివింది. అందరు పిల్లల్లాగే పెరిగి పెద్దవుతున్న కొద్దీ మానసలో కొన్ని అసహజ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వైద్యులను సంప్రదించారు.
పరీక్షించిన వైద్యులు ఆమెలో పురుష లక్షణాలున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ వైద్యుడు చింతోజు శంకర్ను సంప్రదించగా ఆయన శస్త్ర చికిత్స నిర్వహించి మానసను మనోజ్గా మార్చాడు.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్యల సంతానం మానస.. ఇప్పుడు మనోజ్. గవ్వల రాజు కామారెడ్డిలో ఉంటూ అక్కడే తమ పిల్లలను చదివిస్తున్నాడు. అమ్మాయిగా పెరుగుతున్న మనోజ్కు కొన్నాళ్లుగా ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో తల్లిదండ్రులు కామారెడ్డిలో వైద్యులకు చూపించారు.
కానీ.. మానసలో పురుష లక్షణాలు ఉన్నాయని, అమ్మాయిల లక్షణాలేవీ లేవని గమనించిన అక్కడి వైద్యులు నిపుణులను సంప్రదించాలని సూచించారు. సిద్దిపేటకు చెందిన డాక్టర్ చింతోజు శంకర్ గతంలో ఇటువంటి కేసులకు చికిత్స చేశారని తెలుసుకున్న బాలరాజు అతనిని సంప్రందించారు.
పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శంకర్.. మనోజ్ వృషణాలు బయటకు కనిపించకుండా కడుపుకింద భాగంలో ఉన్నాయని గుర్తించారు. ముడుచుకు పోయిన పురుషాంగాన్ని, ఇతర అవయవాలను శస్త్రచికిత్స చేసి సరి చేశారు.
సోమవారంనాడు సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు మంగళవారం ప్రకటించారు. దీంతో మానస పేరును మనోజ్గా మారుస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. అంటే ఇక నుంచి మానస.. మనోజ్గా అందరికి పరిచయమవనున్నాడన్నమాట.
ఈ ఆపరేషన్ గురించి వైద్యుడు చింతో జు శంకర్ మాట్లాడుతూ.. మానస విషయంలో క్రోమోజోమ్ల లోపంతో ఇలా జరిగిందని తెలిపారు. దీని వల్ల అతడి వృషణాలు కడుపు కింది భాగంలో ఉన్నాయని, పురుషాంగం లోపలికి ఉందని చెప్పారు. శస్త్రచికిత్స చేసి వాటిని యథాస్థానంలోకి వచ్చేలా సరిచేశామని, దీనిని వైద్య పరిభాషలో బైలాటరల్ ఆర్కియోపెక్సీగా వ్యవహరిస్తారని వివరించారు.