విషాదం: స్కూల్ బస్సు నుంచి పడి చిన్నారి మృతి, నిర్లక్ష్యమే కారణం
హైదరాబాద్: నగర శివారులోని వనస్థలిపురం సాహెబ్నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఒకటో తరగతి విద్యార్థిని మృతి చెందింది. బస్సులో ఆయా గానీ, సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లేందుకు శనివారం ఉదయం అంజలి అనే విద్యార్థిని ఆ బస్సు ఎక్కింది. వేగంగా నడిపిన బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బస్సులోంచి కిందపడిపోయింది అంజలి.
ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అంజలి మృతిచెందిందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంజలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా, బస్సులు ఆయా గానీ, సెక్యూరిటీ గార్డు గానీ లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అంజలి మృతి చెందిందని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం స్కూల్ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
పిల్లల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్కూల్ యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంజలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.