మరుగుదొడ్డి కట్టించాకే పెళ్లి: ప్రియుడికి ప్రియురాలి నిబంధన ఇది
జగిత్యాల: వారిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు.. ఇరు కుటుంబాల పెద్దలనూ పెళ్లికి ఒప్పించారు. ఈలోగా.. ప్రియుడి ఇంట్లో మరుగుదొడ్డి లేదని ప్రియురాలికి తెలిసింది. దీంతో మరుగుదొడ్డి నిర్మించేవరకూ పెళ్లి చేసుకునేది లేదని షరతు విధించింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో జరిగింది.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనలో వరుడి పేరు తిరుపతి కాగా, వధువు పేరు సత్యవతి. ఆమె ధర్మపురి మండలంలోని దోనూర్కు చెందిన యువతి. తిరుపతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత వీరిద్దరూ మార్చి 6న వివాహం చేసుకున్నారు. సోమవారం స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు రమేష్, సాయన్న, మనీలా గ్రామంలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తుండగా.. సత్యవతి విషయం వెలుగులోకి వచ్చింది.
ఆకతాయి చేష్టలతో పెళ్లి రద్దు: మనస్తాపంతో బీఈడీ విద్యార్థిని ఆత్మహహత్య
వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలంలో సోమవారం గ్రామంలో బీఈడీ విద్యార్థిని కింపూడి ఉషారాణి(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం... ఉషారాణి బ్రౌన్స్ కళాశాలలో బీఈడీ చదువుతోంది. ఈ క్రమంలో ఉషారాణికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కంచికచర్ల మండలానికి చెందిన చెవికల్లు గ్రామానికి చెందిన నరేందర్తో స్నేహం ఏర్పడింది.
ఉషారాణి కుటుంబ సభ్యులు సత్తపల్లి ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించుకున్నారు. ఉషారాణికి పెళ్లి కుదిరిన విషయం తెలుసుకున్న నరేందర్ పెళ్లి కొడుకుకు ఫోన్ చేసి తప్పుడు సమాచారం అందించడంతో ఆ వివాహం రద్దు అయింది. దీంతో ఉషారాణి తల్లిదండ్రులు అప్పటికే కట్నం కింద రూ. 50 వేలు ఇచ్చారు. పెళ్లికి నిరాకరించడంతో కుటుంబసభ్యులు వెనుదిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఉషారాణి సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో నరేందర్ కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వారి సమీప బంధువులు తెలిపారు.
రైలు కిందపడి మహిళ ఆత్మహత్య
వరంగల్ ప్రభుత్వ రైల్వే పోలీసు పరిధిలోని ఇంటకన్నె కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి రైలు కిందపడి భూక్య కాంతి (41) ఆత్మహత్య చేసుకున్నట్లు వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి సోమవారం రాత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసుమద్రం మండలం కనుకుంట్ల తండాకు చెందిన భూక్య బిచ్చ, కాంతి దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
కొంతకాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన హోలీ రోజు మద్యం తాగిన భార్య, భర్తల మధ్య గొడవ జరగడంతో అదే రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి కాంతి బయటకు వెళ్లింది. ఆమె కోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా రైలు పట్టాలపై కాంతి మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.