సెల్ఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
సెల్ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
భూపాలపల్లి: సెల్ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పరగొండకు చెందిన స్వరూప, సాయిలు దంపతులకు ఇద్దరు కూతుళ్లు అనూష, అఖిలలు.
పెద్ద కూతురుకు పెళ్లి కాగా, చిన్న కూతురు అఖిల(18) మండలం కేంద్రంలోని తన నానమ్మ అక్కపాక సారమ్మ ఇంటి వద్దే ఉంటూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా, అఖిల తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తల్లి స్వరూప ఇంటి వద్దే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
ఈ క్రమంలో అఖిల తనకు సెల్ఫోన్ కావాలని కోరడంతో తల్లి బుధవారం ఇంటికి రావాలని చెప్పింది. దీంతో తనకు సెల్ఫోన్ కొనిస్తేనే వస్తానంటూ పట్టుబట్టడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన అఖిల ఇంట్లో ఉన్న ఎలకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన స్థానికులు ప్రైవేటు వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.
తొర్రూరు సబ్ పోస్ట్మాస్టర్ అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో నూతన నోట్లను పంపించి ప్రజలకు నోట్లను మార్పిడి చేయాల్సి ఉండగా.. రూ. 10,14,500లను తొర్రూరు పోస్టాఫీసుకు పంపించగా అట్టి రూపాయలను ప్రజలకు అందించకుండా అక్రమంగా సంపాదించిన తన సొంత పాత నోట్లను మార్చుకొని పోస్టాఫీసులో ఉన్న నగదును డిపాజిట్ చేశారు. దీంతో అధికారులకు అనుమానం రావడంతో.. పై అధికారులు విచారణ చేపట్టి కేసు నమోదు చేయగా పోస్ట్ మాస్టర్ తౌసిఫ్ అహ్మద్పై విచారణ చేపట్టగా స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కావలసిన నగదును ఆధార్ కార్డు తీసుకొని రోజుకు రూ. 4 వేలు మార్చాల్సి ఉండగా పోస్టాఫీసులో పొదుపు చేసే ఖాతాదారులు కొంత మొత్తాన్ని జమచేస్తే వాటిలో నాలుగురెట్లు జమచేశారని లెక్కలు చూపించి, ప్రభుత్వం పంపిన కొత్తనోట్లను మాయం చేశాడని విచారణలో రుజువైనందున అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపినట్లు తొర్రూరు ఎస్ఐ రమణమూర్తి తెలిపారు.
అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
ములుగు: మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని గురువారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించినట్లు పస్రా సీఐ బాలాజీ తెలిపారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలోని నర్సింగాపూర్కు చెందిన బొల్లు దేవేందర్ ఈ నెల 17వ తేదీన అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో బాధితురాలు 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా విచారించగా మహిళపై అత్యాచారం చేసినట్లు దేవేందర్ ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. ఆయన వెంట ఎస్ఐ కరుణాకర్రావు ఉన్నారు.