ఘోర ప్రమాదం: ఎస్ఐతోపాటు నలుగురి మృతి, ఎంతో ఆనందంగా ఉన్నఆ ఫ్యామిలీలో తీరని విషాదం
హైదరాబాద్/అనంతపురం: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎంతో ఆనందంగా ఉన్న అనంతపురంకు చెందిన ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. మధురై సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని పామిడి పట్టణానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. పామిడిలోని బొడ్డురాయివీధికి చెందిన రఘు (29), రాంప్రసాద్ (27). అయ్యప్పస్వామి దర్శనానికి శనివారం ఉదయం పామిడి నుంచి తన మిత్రులైన మధుసూదన్రెడ్డి (35), సుబ్బరాయుడుతో కలిసి సొంత కారు టీఎస్ 08 క్యూ 0006లో డ్రైవర్ మహేష్ (24)తో కలిసి వెళ్లారు.
నలుగురు అక్కడికక్కడే..
వీరు ప్రయాణిస్తున్న కారు మధురై సమీపంలోని మరవన్కుళం వద్ద సోమవారం రాత్రి అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రఘుతోపాటు ఆయన సోదరుడు, కానిస్టేబుల్ రాంప్రసాద్ అలియాస్ చిన్నా, మిత్రుడు మధుసూదన్రెడ్డి, డ్రైవర్ మహేష్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని స్థానికులు.. పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు.
ఉన్నత చదువులు చదివారు..
పామిడిలోని బొడ్డురాయి వీధికి చెందిన నాగభూషణానికి ఒక కూతురు గౌరి, ముగ్గురు కొడుకులు మురళి, రఘు, రాంప్రసాద్ ఉన్నారు. వీరిది సామాన్య కుటుంబం. నాగభూషణం పామిడిలో హోటల్ నిర్వహిస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కూతురు గౌరి ధర్మరంలో స్థిరపడ్డారు.
ఉన్నత స్థాయిల్లోనే..
పెద్దకుమారుడు విశాఖపట్నంలో వ్యాపారం చేస్తున్నారు. రెండో కుమారుడు రఘు హైదరాబాద్లోని సైబర్ క్రైం స్టేషన్లో ఎస్ఐగా, సోదరుడు రాంప్రసాద్ ధర్మవరం పట్టణ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఎస్ఐ కావాలనేది రఘు కల..
రఘుకు ఎస్ఐ కావాలన్నదే కల. మొదట ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఎంపికైన రఘు ఎస్ఐ పరీక్షలకు సిద్ధమయ్యాడు. పట్టుదలతో శ్రమించి 2015 డిసెంబరులో ఎస్ఐగా ఎంపికయ్యాడు. కుటుంబమంతా ఉన్నత పదవుల్లో ఉండి, సంతోషంగా గడుపుతున్న సమయంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగి వారికి తీరని శోకం మిగిల్చింది. నలుగురి మృతి పామిడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.