టీకా వేయిస్తానంటూ.. కోటి ఆస్పత్రి నుంచి శిశువును ఎత్తుకెళ్లిన మహిళ
హైదరాబాద్: కోఠి సుల్తాన్ బజార్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు.
ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. ఇది గమనించిన పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని మహిళ.. శిశువుకు టీకా ఇప్పిస్తానటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు.
వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, పసికందు అదృశ్యమైన వార్తను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై పోలీసులు, సెక్యూరిటీ గార్డులు దాడికి యత్నించారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.