కలెక్టర్లతో కేసీఆర్ సమావేశంలో కీలక చర్చ .. కలెక్టర్ పేరు మార్చే నిర్ణయం తీసుకున్న కేసీఆర్
రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు తెలంగాణ సీఎం కేసీఆర్ .అత్యంత కీలకమైన ఈ సమావేశం నిన్న, నేడు రెండు రోజులపాటు కొనసాగుతోంది ఇక ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జోషి ఇతర ఉన్నతాధికారులు హాజరైనట్లు గా తెలుస్తుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో నిన్న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్ల ముందు పలు కీలక అంశాలను ఉంచారు.
కలెక్టర్ పేరు మారుస్తామని చెప్పిన కేసీఆర్ ... కొనసాగుతున్న సీఎంతో జిల్లా కలెక్టర్ల సమావేశం
తెలంగాణా సీఎం కేసీఆర్ తో జిల్లా కలెక్టర్ల సమావేశం నేడు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా జిల్లా పరిపాలన అధికారి అయిన కలెక్టర్ కు సంబంధించి కలెక్టర్ అన్న పేరును మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని కలెక్టర్లతో చర్చించారు సీఎం కెసిఆర్ . బ్రిటిష్ పాలనలో పన్నుల వసూళ్ల కోసం పెట్టిన కలెక్టర్ పేరు మార్చి, కొత్త పేరును సూచిస్తామని మంగళవారం నిర్వహించిన సమావేశంలో సీఎం కలెక్టర్లతో చెప్పారు. ప్రసుత్తం కలెక్టర్లు పన్నులు వసూలు చేయడం లేదు కాబట్టి ఆ పేరు కొనసాగించడం సరికాదనే ఉద్దేశంతోనే కలెక్టర్ పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు గాంధీ జయంతి నుండి కొత్త రెవెన్యూ చట్టం అన్న కేసీఆర్
ఇక అంతే కాదు తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ అంతా అవినీతి అక్రమాలతో ముడిపడి ఉందని, లంచం లేనిదే ఎవరూ పనిచేయడం లేదని తన దృష్టికి వచ్చినట్లుగా ముఖ్యమంత్రి కలెక్టర్లతో చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే రెవెన్యూ వ్యవస్థలో సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నామని గాంధీ జయంతి నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తీసుకువస్తామని ఆయన కలెక్టర్లకు తెలిపారు. లంచాల వ్యవస్థను రూపుమాపేందుకు చేస్తున్న ప్రయత్నంలో తగు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన కలెక్టర్లను కోరారు.
60 రోజుల కార్యాచరణ,రాష్ట్రాభివృద్ధిపై కలెక్టర్లతో సీఎం చర్చ
ఇక స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై కెసిఆర్ సమావేశంలో మాట్లాడారు. హరితహారం, స్వచ్ఛత మిషన్ ద్వారా పట్టణాలు గ్రామాలను ఎలా అభివృద్ధి చేయవచ్చు, ఎలా సుందరంగా తీర్చిదిద్దవచ్చు వంటి అనేక అభిప్రాయాలు ఆయన కలెక్టర్ల నుండి తీసుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేయదలచిన అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై కలెక్టర్లతో చర్చించిన సీఎం కేసీఆర్ పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలకు సంబంధించి వాటి లక్ష్యాల గురించి కలెక్టర్లకు వివరించారు. ఇక పర్యావరణాన్ని కాపాడడానికి రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు పెంచాలని నిర్ణయించిన కేసీఆర్ దీని కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన గ్రీన్ కమిటీలను వేస్తానని చెప్పారని తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర అభివృద్ధి, త్వరలో అమలు చేయాలని భావిస్తున్న కొత్త చట్టాల గురించి సీఎం కేసీఆర్ నేడు కూడా జిల్లా కలెక్టర్లతో చర్చిస్తున్నారు.