వేధిస్తున్నాడని భర్తపై భార్య ఇలా....నెలన్నర తర్వాత పోలీసులకు చిక్కిందిలా...
నిత్యం భర్త వేధింపులను భరించలేక ఓ భార్య కొడుకు సహయంతో భర్తను హత్య చేసింది.అయితే భర్త ఆత్మహత్య చేసుకొన్నాడని నమ్మించేందుకు ప్రయత్నించింది.అయితే ఎట్టకేలకు పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది.
హైదరాబాద్:నిత్యం అనుమానంతో వేధిస్తోన్న భార్యను పథకం ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది ఓ గృహిణి.అయితే నిందితురాలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు నిఘా వేస్తే అసలు విషయం బయటపడింది. వాస్తవాన్ని బాధితురాలు ఒప్పుకొంది.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపెల్లికి చెందిన చింతకుంట్ల శ్రీనివాస్ , అమృత దంపతులు బతుకు దెరువు కోసం హైద్రాబాద్ కు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ళ క్రితం వీరు తమ స్వగ్రామం నుండి పీర్జాదిగూడ బుద్దానగర్ లో అద్దె ఇంట్లోకి మకాం మార్చారు.
శ్రీనివాస్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసవాడు. అమృత పీర్జాదిగూడలోని కర్ణాటక బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేసింది. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకొన్న భర్త తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఆమెను వేధించేవాడు.
విధులకు వెళ్ళి శ్రీనివాస్ మూడు రోజులకు ఓ సారి ఇంటికి వచ్చేవాడు.అయితే భర్త వేధింపులు భరించలేక అమృత ఇంటర్ చదివే తన కొడుకుకు తండ్రిపై చాడీలు చెప్పడం ప్రారంభించింది.
అయితే దీంతో శ్రీనివాస్ ను చంపేందుకు తల్లి , కొడుకు పథకం వేశారు.గత ఏడాది డిసెంబర్ 31వ, తేదిన విధులను ముగించుకొని ఇంటికి వచ్చాడు శ్రీనివాస్ . అయితే ఇంటికి రాగానే భార్యతో గొడవపెట్టుకొన్నాడు శ్రీనివాస్.
గొడవ ముగిసిన తర్వాత మద్యం తాగి శ్రీనివాస్ పడుకొన్నాడు. ఇదే అదనుగా భావించిన భార్య అమృత, కొడుకు వెంకటేష్ లు శ్రీనివాస్ గొంతునులిమి చంపారు.
అయితే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకొన్నాడని నమ్మించేందుకుగాను ప్లాస్టిక్ వైరును గొంతుకు బిగించి ఫ్యాన్ కు వేలాడదీశారు. తెల్లారేసరికి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకొన్నాడని నమ్మించారు.అంతేకాదు పోలీసులు వచ్చేసరికి మృతదేహన్ని కిందకు దించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.
నెలన్నర రోజుల పాటు అమృత కదలికలపై పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు.పోస్టు మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరోసారి విచారణ ప్రారంభించారు. అమృతను ప్రశ్నిస్తే అసలు విషయాలు వెలుగు చూశాయి. భర్త వేధింపులు, అనుమానాలతో అతణ్ణి చంపినట్టుగా నిందితురాలు ఒప్పుకొంది. శనివారం నాడు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అమృత కొడుకు వెంకటేష్ పరారీలో ఉన్నాడు.