‘డెలాయిట్’ లేడీ టెక్కీ ఆత్మహత్య: దొంగల బీభత్సంతో దంపతులకు తీవ్ర గాయాలు
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. రచ్చ శైలజ భార్గవి(29) అనే సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా శైలజ ఉద్యోగం చేస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్నున్నారు. కుటుంబకలహాలతోనే శైలజ ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
కాగా, అదనపు కట్నం కోసం భర్త వేధింపుల కారణంగానే భార్గవి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, మృతురాలి భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే. ఆయన టిసిఎస్లో ఉద్యోగం చేస్తున్నాడు.
దోపిడీ దొంగల బీభత్సం: దంపతులకు తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొండపాక మండలంలోని బందారం దర్గాలో స్టోన్ క్రషర్ వద్ద కాపలదారులుగా పనిచేస్తున్న వృద్ధ దంపతులు రామయ్య, లక్ష్మవ్వపై తెల్లవారుజామున దొంగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
దొంగల దాడిలో రామయ్య తలకు, లక్ష్మవ్వకు రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం దుండగులు లక్ష్మవ్వ మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు.
ప్రస్తుతం రామయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సుమతి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.