దారుణం: కారుతో సహా న్యాయవాదిని సజీవదహనం చేశారు
హైదరాబాద్: నగర శివారులోని కీసరలో దారుణం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఓ న్యాయవాదిని దుండగులు కారులో సజీవదహనం చేశారు. కుషాయిగుడాకు చెందిన న్యాయవాది ఉదయ్కుమార్ను నగర శివారు కీసర వద్ద నిర్మానుష్యప్రాంతంలో కారుతో పాటు దహనం చేశారు.
పాతకక్షలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కారు నెంబర్. ఏపీ 28 ఎల్ 4850, ఇతర ఆధారాలతో హత్యకు గురైన వ్యక్తి న్యాయవాది ఉదయ్కుమార్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ గురవారెడ్డి తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 12గంటలకు ఓ విడాకుల కేసు కోసం మృతుడు కార్యాలయం నుంచి వెళ్లిపోయాడని కార్యాలయంలోని సిబ్బంది ఒకరు తెలిపారు. లాయర్ సతీమణి తన భర్త సాయంత్రం వరకూ ఇంటికి రాలేదని చెప్పడంతో, ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కారు మాదే కానీ, దుస్తులు మా వారివి కావు: ఉదయ్ కుమార్ భార్య
ఉదయ్ శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లారనీ, ఆ తర్వాత కొంతసేపటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్లు ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉదయ్ భార్య జగదీశ్వరి మాట్లాడుతూ.. కారు తమదేనని, మృతుని ఒంటిపై ఉన్న దుస్తులు, చెప్పులు తన భర్తవి కావని తెలిపారు. కాగా, భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని ఉదయ్ తండ్రి చెప్పారు.
కేబీహెచ్బీలో దొంగల బీభత్సం
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ఒకేరోజు మొత్తం 7 చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. కేపీహెచ్బీ ఏడో ఫేజ్లో తాళం వేసివున్న ఒక ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.
సమీపంలోని ప్రగతినగర్లోని ఓ ఇంట్లో సుమారు రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు అందుబాటులో లేకపోవడంతో.. ఎంత మొత్తం చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రాలేదు.
శనివారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫూటేజిల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.