శబరిమలలో గుండెపోటుతో న్యాయవాది మృతి
శబరిమల/హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన కృష్ణవిజయ్ అనే న్యాయవాది కేరళ రాష్ట్రంలోని శబరిమలలో గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు నగరానికి చెందిన బోయినపల్లి వాసిగా గుర్తించారు. చాతిలో నొప్పిగా ఉందని పడిపోయిన విజయ్ను తోటి భక్తులు స్థానిక వైద్య శిబిరానికి తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
వేములవాడలో కన్నతండ్రి కాఠిన్యం
కరీంనగర్ జిల్లా వేములవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. రెండో భార్య మోజులో పడిన ఓ వ్యక్తి.. తన కన్న పిల్లలను ఇంటి నుంచి గెంటేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియురాలితో అదృశ్యమయ్యాడు. ఈ మధ్యనే చిన్నారుల తల్లి చనిపోయింది. రెండో పెళ్లి చేసుకున్న ఆ దుర్మార్గుడు పసిపిల్లలకు నరకం చూపించాడు. పసిపిళ్లలన్న కనికరం లేకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు.
ఏడాది వయస్సున్న తన తమ్ముడ్ని పట్టుకుని అక్క చలిలో వణుకుతూ బస్టాండ్లో తలదాచుకుంటోంది. తమ్ముడిని ఎత్తుకొని ఆ చిన్నారి భిక్షాటన చేసి కడుపునింపుకుంటోంది. స్థానికుల సమాచారం మేరకు వీరిని చేరదీసిన పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ మద్యం విక్రయిస్తున్న ఏడుగురు అరెస్టు
మెదక్ జిల్లాలో నకిలీ మద్యం విక్రయిస్తున్న ఏడుగురిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 15 లక్షల విలువైన నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. మూడు వైన్స్ షాపులను అబ్కారీ పోలీసులు సీజ్ చేశారు.