సానియా ఇంటికే టెండర్: రోశయ్య బంధువునంటూ కోట్లకు టోకరా
హైదరాబాద్: మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీతారలు, అధికారంలో ఉన్న వ్యక్తులను ఉపయోగించి భారీ మోసాలకు తెరతీస్తున్నారు. నగరంలో ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా మద్దూరుకు చెందిన చొక్కారపు మీనయ్య గుప్తా అనే వ్యక్తి చేసిన మోసాలు మామూలివి కావు.
ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు సమీప బంధువునని, ఏఐఐసీ సభ్యుడినని, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మెడికల్ సీట్లు ఇప్పిస్తానంటూ రూ.20కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు వసూలు చేశాడు గుప్తా. దీంతో ఖరీదైన కార్లలో తిరుగుతూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
కాగా, పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం మేడిపల్లి పోలీసులు.. మీనయ్యగుప్తాను అదుపులోకి తీసుకొని విచారించగా అతని మోసాలు వెలుగులోకి వచ్చాయి. మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా మద్దూరుకు చెందిన మీనయ్యగుప్తా స్థిరాస్తి వ్యాపారి. కొన్నేళ్లుగా నగరంలోనే ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు.
స్థిరాస్తి వ్యాపారంలో అనుకున్న మేరకు లాభాలు రాకపోవడంతో ఇతర మార్గాలను అన్వేషించాడు. తన స్నేహితుడు చెర్కు శివారెడ్డితో కలిసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, మెడికల్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామంటూ పలువురిని నమ్మించాడు. తమిళనాడు గవర్నర్ రోశయ్య తనకు సమీప బంధువని, ఏఐసీసీలో సభ్యుడిగా కొనసాగుతున్నందున రాజకీయ పలుకుబడితో పనులు చక్కబెడతానని నమ్మబలికాడు.
ఈక్రమంలో శివారెడ్డి ద్వారా కొర్రెముల గ్రామానికి చెందిన వి.నారాయణ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.33 లక్షలు, హిమాయత్నగర్కు చెందిన డాక్టర్ శైలజ నుంచి రూ.12 లక్షలు, మీర్పేట్ ఎంపీటీసీ లలితా జగన్ నుంచి రూ.20 లక్షలు, ఫిర్జాదిగూడ ఎంపీటీసీ వేముల కేశవనాథంగౌడ్ నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు.
అంతేగాక, సాయివెంకట వరప్రసాద్ అనే వ్యక్తికి చెందిన 1.10 ఎకరాల భూమిని మీనయ్యగుప్తా తన పేరుపై రిజిస్ట్రేన్ చేయించుకొని దస్త్రాలను తనఖా పెట్టి రూ.40లక్షలు తీసుకున్నాడు. ఇలా సుమారు రూ.20కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు వసూళ్లకు పాల్పడ్డాడు. వీరంతా మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట, హయత్నగర్, మేడిపల్లి పోలీస్స్టేషన్లలో గుప్తాపై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో గాలింపు చేపట్టిన పోలీసులు.. మీనయ్యను కూకట్పల్లి సమీపంలోని లోథా అపార్టుమెంట్లో అదుపులోకి తీసుకున్నారు. చెర్కు శివారెడ్డి, చొక్కారపు మణిరాజ, చొక్కారపు లక్ష్మి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుల ప్రకారం పీడీయాక్టు అమలు చేస్తామని ఏసీపీ రవిచందన్రెడ్డి తెలిపారు. అతని నుంచి విదేశీ కారు, జపాన్కు చెందిన చేతి గడియారం, బ్యాంకు చెక్కులు, రోశయ్యతో దిగిన చిత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
టెన్నిస్ స్టార్ సానియా ఇంటిని అమ్మేసే యత్నం
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఖరారైందంటూ ప్రచారం చేసుకున్నాడు మీనయ్య గుప్తా. చివరకు టికెట్ రాకపోవడం జూబ్లీహిల్స్లోని టెన్సిస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడికి మకాం మార్చాడు.
కాగా, కొన్నినెలలు ఉన్న తర్వాత ఆ ఇంటినే అమ్మకానికి పెట్టాడు గుప్తా. విషయం తెలుసుకున్న సానియా తల్లి.. మీనయ్యగుప్తాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఎలాగోలా ప్రాధేయపడి అక్కడినుంచి లోదా అపార్టుమెంట్లోకి మారాడు. ఆ ఇంటి అద్దె నెలకే రూ.1.3 లక్షలు కావడం గమనార్హం. అమాయకులను నమ్మించి భారీ మోసాలకు పాల్పడుతూ విలాస జీవితాన్ని గడిపిన గుప్తా.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.