భార్యపై అనుమానం: రోడ్డుపైనే రోకలిబండతో మోది దారుణ హత్య(ఫొటోలు)
హైదరాబాద్: అనుమానమే పెను భూతమే ఓ వివాహిత ప్రాణం తీసింది. భార్యపై పెంచుకున్న అనుమానంతో ఆమెను దారుణంగా కొట్టిచంపాడో భర్త. ఈ ఘటన
బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నెం.12లోని సయ్యద్నగర్లో నివసించే సయ్యద్ అక్రమ్(35) నాంపల్లిలోని ఒక బేకరీలో పనిచేస్తుంటాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన షాహినాబేగం(30)తో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు.
కాగా, అక్రమ్కు భార్యపై చాలా రోజులుగా అనుమానం ఉంది. ఎవరితో మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా సహించే వాడు కాదు. ఈ నేపథ్యంలో గత ఆదివారం ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. షాహినాబేగం తన పుట్టింటికి వెళ్లింది. పెద్దల సమక్షంలో మాట్లాడుకుని మళ్లీ ఇంటికొచ్చింది.
ఈ క్రమంలో శనివారం ఉదయం తన కుమార్తెను తీసుకొని పక్కనే ఉన్న పాఠశాలలో వదిలి వెళ్లేందుకు సిద్ధమవగా అక్రమ్ ఆమెతో గొడవకు దిగాడు. రోడ్డుమీదనే ఆమెను తీవ్రంగా కొట్టాడు. అంతేగాక, పక్కనే ఉన్న రోకలిబండ తీసుకొని ఆమె తలపై పలుమార్లు బలంగా కొట్టాడు.
తలపగిలి తీవ్ర రక్తస్రావమవడంతో కుప్పకూలిన షాహినా బేగం.. అక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆమె చనిపోవడంతో పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందంతో గాలించి గంటల్లోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకొన్నారు.