అనుమానం: బైక్తో భార్యను ఢీకొట్టి హతమార్చిన భర్త
అనుమానమే పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కడవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ కలిసి జీవిస్తానని ప్రమాణం చేసిన భర్తే..
జయశంకర్భూపాపల్లి: అనుమానమే పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కడవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ కలిసి జీవిస్తానని ప్రమాణం చేసిన భర్తే.. ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి భార్యను కడతేర్చిన సంఘటన ములుగులో సోమవారం జరిగింది.
స్థానికు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన బొంత యాదయ్య సుమతకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లలు కలిగారు. బతుకు దెరువు కోసం గత ఏడాది ములుగుకు వచ్చిన దంపతులు ఎస్ఎస్ బ్రాందీ షాపు సమీపంలో చిన్న హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
అయితే భర్త యాదగిరి అనుమానంతో సుమతను నిత్యం వేధిస్తుండేవాడు. ఇరువురి మధ్య జరుగుతున్న గొడవతో గత కొన్ని మాసాలుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం యాదగిరి భార్య సుమతకు ఫోన్చేసి తాను పురుగుల మందు తాగానని అనండంతో వెంటనే ఏరియా వైద్య శాలకు వెళ్లి విచారించింది.
అక్కడ యాదగిరి లేకపోవడంతో తమ హోటల్కు వెళ్తుండగా పోలీస్స్టేషన్ సమీపంలోకి రాగానే ఆ పరిసరాల్లో కాపుకాసిన యాదగిరి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వచ్చి సుమతను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సుమతను 108 వాహనంలో తరలించి ఏరియా వైద్యశాలలో చేర్పించారు. కాగా, ఆమె పరిస్థితి విషయమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా సుమత మృతి చెందింది. ఈ ఘటన పై ములుగు పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.