హైదరాబాద్-ఖమ్మం: ఆలుమగలను కలిపేందుకు వెళితే చంపేశారు
ఖమ్మం: ఆలుమగల మధ్య గొడవ జరుగుతుంటే పోవద్దని ఇందుకే అంటారేమోనని ఈ ఘటన తీవ్రతను చూస్తే తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో ఓ దంపతులు గొడవపడుతుంటే.. వారిని వారించేందుకు వెళ్లిన మధ్య దారుణ హత్యకు గురయ్యాడు.
ఆలస్యంగా వెలుగు చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఇల్లందు 24వ ఏరియాకు చెందిన దంపతుల మధ్య కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో సదరు మహిళ హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో ఆమె అద్దెకు ఉండే ఇంటి యజమాని ఆమె సమస్యను తెలుసుకున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలోనే వారం క్రితం అతడు ఇల్లందు వచ్చాడు.
కాగా, ఇక్కడ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో తలదూర్చిన అతడ్ని.. మహిళ భర్త హత్య చేశాడు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో పూడ్చిపెట్టాడు.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్లో ఉండే మృతుడి కుటుంబీకులు అతడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఇల్లందు చేరుకుని విచారణ చేపట్టారు. వారి దర్యాప్తులో అతడు హత్య గురయ్యాడని గుర్తించిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.