భర్తను చంపుతానని భార్యపై రేప్: స్నేహితుడికి చెప్తే అతడు కూడా..
ఖమ్మం: జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భర్తను చంపుతానని బెదిరింపులకు గురిచేసిన ఓ దుర్మార్గుడు.. ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తను చేసిన అఘాయిత్యాన్ని తన స్నేహితుడితో పంచుకున్నాడు. దీంతో అతడు కూడా బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాధిత మహిళ భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని చీమలపాడులో సంచారజాతికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి ఉపాధి కోసం 4 నెలల క్రితం మహారాష్ట్రకు వెళ్లింది. కాగా, ఏన్కూర్ మండలం రాజలింగాలకు చెందిన వీరి బంధువు నెరసుల నరేష్ అక్కడే ఉంటున్నాడు.
ఈ క్రమంలో భర్తలేని సమయంలో సదరు మహిళ వద్దకు వచ్చి బెదిరింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు నరేష్. ఎవరికైనా ఈ విషయం చెబితే నిన్ను, నీ భర్తను చంపుతానని బెదిరింపులకు గురిచేయడంతో ఆమె ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది.
నెలరోజుల తర్వాత భర్తతో కలిసి ఆమె తమ స్వగ్రామానికి చేరుకుంది. గ్రామంలోనే భర్త కూలీ పనులు చేస్తుండగా, భార్య మేకలు కాస్తూ జీవితం కొనసాగిస్తున్నారు. కాగా, నిందితుడు నరేష్.. వరుసకు సోదరుడయ్యే ముదిగొండకు చెందిన నెరసుల బాబుకు జరిగిన విషయాన్ని చెప్పాడు.
దీంతో ఇతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు కుట్ర పన్నాడు. 4రోజుల క్రితం చీమలపాడుకు వచ్చిన బాబు.. మేకలు కాసేందుకు వెళ్లిన బాధితురాలిని అడ్డగించాడు. ఆ తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత కూడా బెదిరింపులకు గురి చేయడంతో బాధితురాలు.. తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలితోపాటు ఆమె భర్త పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘోరాన్ని వివరించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.