టోల్ ఫ్రీ నెంబర్లను కూడ వదలని పోకిరీ, మహిళలతో అసభ్యకరంగా ...
హైదరాబాద్:మహిళల గొంతు వినబడితే చాలు ఆ వ్యక్తికి పండగే, ఫోన్లే వారిని మాటలతో వేధిస్తాడు.చివరకు టోల్ ఫ్రీ నెంబర్లను కూడ వదల్లేదు ఆ దుండగుడు.ఓ బాధితురాలు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హైద్రాబాద్ జీడిమెట్లలోని చెరుకుపల్లి కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్ అనే వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్లను ఎంచుకొని ఫోన్లు చేసేవాడు.
టోల్ ప్రీ నెంబర్ లో మహిళలు మాట్లాడితే చాలు వారిని తన మాటలతో వేధించేవాడు.ఫోన్ కట్ చేసినా పదే పదే ఫోన్ చేసేవాడు. అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడు.
అయితే శివకుమార్ తీరుతో ఇబ్బందులకు గురైన ఓ బాధితురాలు షీ టీమ్ కు ఫిర్యాదు చేసింది.శనివారం నాడు శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలు కేసు వద్దని హెచ్చరించి వదిలి వేయాలని పోలీసులకు సూచించింది.దీంతో నిందితుడిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
ఆనందం కోసమే ఇలా చేశా
శివకుమార్ వందలకొద్ది ఫోన్లు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. బంజారాహిల్స్ కు చెందిన ఓ బాధితురాలు షీ టీమ్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.అయితే ఈ రకంగా ఫోన్లు చేసి వేధించడం వల్ల మానసిక ఆనందం కలుగుతోందని శివకుమార్ చెప్పాడు.అయితే ప్రవర్తన మార్చుకొనేవరకు వారానికి ఓ సారి రావాల్సిందేనని పోలీసులు సూచించారు.