ప్రేమించి వస్తే ‘ఆమె’ను సమాధి చేశాడు, మరో పెళ్లి చేసుకుని.: ఆమె సోదరుడి అన్వేషణతో ఘోరం వెలుగులోకి
Recommended Video
హైదరాబాద్/నల్గొండ: అతడ్ని ప్రేమించి కుటుంబాన్ని కూడా వదులుకునే వస్తే.. ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడా దుర్మార్గుడు. ఆమెను ప్రేమించినట్లు నటించి.. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు బిడ్డల్నీ కన్నాడు.
ఆ తర్వాత ఆమెకు తెలియకుండా మరోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యను చంపి ఆ ప్రేమ..పెళ్లి తాలూకూ రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేశాడు. అయితే, చేసిన పాపం ఊరికిపోదు కదా! ఫేస్బుక్లో ఉంచిన ఆ దుర్మార్గుడి ఫొటో.. అతడ్ని శిక్ష అనుభవించిలే చేసింది.ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రేమ.. రహస్యంగా పెళ్లి.. మూడేళ్లు కాపురం
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన మోర హన్మంతు హైదరాబాద్లో కారు డ్రైవర్గా పని చేస్తుండేవాడు. ఎల్బీనగర్ మజీద్గల్లీలో ఉంటున్న నార్కట్పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన ప్రియాంకను మూణ్నెల్లపాటు ప్రేమించి.. 2006లో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. విషయం తన వాళ్లకుగానీ..భార్య తరఫు వారికి గానీ తెలియకుండా జాగ్రత్త తీసుకున్నాడు. మూడేళ్లు కాపురం చేయడంతో వీరికి కుమార్తె, కుమారుడు కూడా జన్మించారు.
ప్రియాంకకు తెలియకుండా మరో పెళ్లి..
కాగా, భార్య ప్రియాంకకు తెలియకుండా 2007లో తల్లిదండ్రులు చూసిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న హన్మంతు.. ఆమెతో స్వగ్రామంలోనే కాపురం పెట్టాడు. స్వగ్రామంలో వ్యవసాయ పనుల్లో ఉన్నానని నమ్మబలుకుతూ.. మొదటి భార్యను మభ్యపెట్టాడు. చివరకు ఆమె వదిలించుకునేందుకు పథకాలు పన్నాడు.
చివరకు ప్రియాంకను చంపేశాడు..
2009లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను వెంకేపల్లి గ్రామానికి తీసుకొచ్చి ఇంట్లోనే హత్యచేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గ్రామ శివారులోని బావిలో పడేశాడు. ఆ బావిలో..గ్రామస్థులంతా జంతువుల కళేబరాలు, వ్యర్థాలు వేస్తుండటంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు.
ప్రియాంక కోసం సోదరుడు అన్వేషణ
అయితే, ప్రియాంక రెండోసారి గర్భం దాల్చిన సందర్భంలో ఆమె తమ్ముడు ఉపేందర్ అనుకోకుండా హైదరాబాద్లో ఆమెను కలిశాడు. నాలుగు రోజులు అక్క ఇంట్లోనే గడిపాడు. కొన్ని నెలల తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకని మళ్లీ వెళ్లగా.. ఆ ఇంట్లో వాళ్లు లేరు. ఆమె కుటుంబ ఆచూకీ కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకపోవడంతో 2009లో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిగులుతో 2010లో ప్రియాంక తండ్రి మరణించాడు కూడా.
ఫేస్బుక్ ఫొటోతో దొరికిన నిందితుడు..
కాగా, ఇటీవల ఫేస్బుక్లో రెండో భార్య, పిల్లలతో ఉన్న ఫొటోలో ఉన్నది హన్మంతేనని నిర్ధారించుకున్న ఉపేందర్.. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీస్స్టేషన్, అనంతరం మర్రిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు హన్మంతును అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు హన్మంతు తన మొదటి భార్యను చంపి మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అంగీకరించాడని, మృతదేహం కోసం గాలింపు చర్యలు ఆరంభించామని సీఐ ప్రభాకర్రెడ్డి శుక్రవారం వెల్లడించారు. నిందితుడు హన్మంతు ఇచ్చిన సమాచారంతో ప్రియాంక ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మల్లేపల్లిలో బాబు రాజ్కిరణ్ నాగార్జునసాగర్లో పాప ఆచూకీ కనుగొన్నారు. బాబు కూడా మరొకరి దగ్గర క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నారు. కాగా, శనివారం బావిలోంచి ప్రియాంక మృతదేహాన్ని పైకి తీశారు.