శత్రువును భయపెట్టేందుకు అమాయకుడ్ని అంతమొందించారు: తల, మొండెం వేరుగా..
వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేయడంపై సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ, ఇక్కడ వాస్తవంగా జరిగింది. ఈ దారుణ ఘటనలో ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తితో పరిచయం...
సోమవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిల్లాకు చెందిన వెంకన్న(46) పదేళ్ల క్రితం కేసముద్రం మండలం వచ్చి కాగితాలు, అట్టలు ఏరుకుని విక్రయిస్తూ రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. కాగా, గిర్నితండాకు చెందిన ఆంగోతు హరీష్కు వెంకన్నతో పరిచయం ఉంది.
శత్రువును భయపెట్టేందుకు కుట్ర..
హరీష్కు తన ఇంటి పక్కన ఉన్న కర్పూరపు గోపాల్తో ఇంటి స్థలం విషయమై కొద్ది కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గోపాల్ను భయపెట్టి స్థలాన్ని కాజేయాలని హరీష్ కుట్రపన్నాడు. ఈ క్రమంలో ఒంటరిగా జీవిస్తున్న వెంకన్నను హతమార్చి.. గోపాల్ను భయపెట్టాలను నిర్ణయించుకున్నాడు.
మద్యం తాగించి.. దారుణం..
ఆదివారం రాత్రి వెంకన్నను తన ఇంటికి పిలిచి మద్యం తాగించాడు. అతను కూడా తాగాడు. ఆ తర్వాత హరీష్ పారతో వెంకన్న మెడపై దాడి చేసి.. పదునైన ఆయుధంతో తలను, మొండేన్ని వేరు చేశాడు. ఆ తర్వాత వెంకన్న మొండేన్ని పక్కనే ఉన్న గోపాల్ ఇంటి స్థలంలో వదిలేసి, అతని తలను సంచిలో పెట్టుకుని మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలోని ఓ ఇంటి పక్కన పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపి నిందితుడు హరీశ్ను అరెస్ట్ చేశారు. ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.