అప్పుడు రీల్స్ చేస్తూ.. ఇప్పుడు ప్రయాణిస్తూ.. చోటు ఒక్కటే.. కానీ మనిషి వేరు.. కాపాడింది ఆ ముగ్గురే..
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, రైలు పట్టాలు దాటుతున్నప్పుడు, రైల్వే ట్రాక్ పక్క ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ప్రాణాలు పోతాయి. నెల రోజుల క్రితం హనుమకొండ జిల్లా వడ్డెపల్లి చెరువు కట్టమీద అక్షయ్ అనే యువకుడు స్నేహితులతో కలిసి రైలు ముందు రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. పట్టాల పక్కకు నడుస్తూ రీల్స్ చేస్తుండా రైలు ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు రైల్వే ట్రాక్మెన్లు రాజు, తిరుపతి, సురేష్.
అదే ప్రాంతంలో
చికిత్స చేసిన వైద్యులు అతని ప్రాణాలు రక్షించారు. తాజా అదే ప్రాంతంలో అంటే వడ్డెపల్లి చెరువు కట్టపై రైల్వే పట్టాల పక్క ఓ వ్యక్తి తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. రైలు పట్టాలమీద తీవ్రగాయాలతో గంటన్నరపాటు పడి ఉన్న ప్రయాణికుడు శాంతిరాంను ఆ ముగ్గురే కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 4వ తేదీ మధ్యప్రదేశ్కు చెందిన శాంతిరాం(24) లక్నో ఎక్స్ప్రెస్లో కాచిగూడ నుంచి నాగపూర్కు వెళ్తున్నాడు.
డోర్ వద్ద
రైలులో జనం భారీగా ఉండటంతో శాంతిరాం డోర్ వద్ద కూర్చున్నాడు. వడ్డెపల్లి చెరువు కట్ట వద్ద ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అతను ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్యలో జారిపడ్డట్టు రైల్వే పోలీసులు తెలిపారు. తెల్లవారుజాము కావడంతో అటుగా ఎవరు వెళ్లలేదు. ఉదయం 6.15 గంటలకు కీమెన్ రాజు రైలు పట్టాలను పరిశీలిస్తూ వెళ్తుండగా రైలుపట్టాల కంకరమీద అపస్మారక స్థితిలో పడి ఉన్న శాంతరాంను గుర్తించాడు.
ఆసుపత్రికి
గ్యాంగ్మెన్లు తిరుపతి, సురేష్, పి.రాజు, ప్రవీణ్లకు రాజు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అంబులెన్సుకు ఫోన్ చేసి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శాంతిరాం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శాంతిరాం కుటుంబానికి సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు.