వీడూ ఓ కొడుకేనే?: బతికుండగానే తల్లిని స్మశాన వాటికకు తరలించాడు
Recommended Video
కరీంనగర్: ఎన్నో కష్టనష్టాలకోర్చి.. నవమాసాలు మోసి.. కని, పెంచి పెద్ద చేస్తే.. ఆ పుత్ర రత్నం చివరకు కన్న తల్లిని బతికుండగానే స్మాశానికి తరలించాడు. మానవత్వాన్ని మంటగలిపిన ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి సమాచారం ఇవ్వడంతో.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు సిబ్బంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వీక్లీ బజార్లో ఉండే నర్సమ్మ(95) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈమె భర్త ముప్పయ్యేళ్ల క్రితం చనిపోయారు. దీంతో కుమారుడు ధర్మయ్య ఆమెను చూసుకుంటున్నాడు.
వృద్ధాప్యం కారణంగా నర్సమ్మ తరచూ అనారోగ్యానికి గురవుతోంది. తాము ఉండేది అద్దె ఇల్లు కావడంతో.. ఇంట్లో తల్లి చనిపోతే ఆ ఇంటి యజమాని ఏమంటారోనని ఆందోళన చెందాడు ధర్మయ్య. ఆ తర్వాత ప్రాణాలతో ఉండగానే కన్న తల్లిని స్మశానానికి తరలించాడు. అక్కడున్న ఓ గదిలో వదిలేశాడు.
వృద్ధురాలి దీనస్థితిని చూసి చలించిపోయిన స్థానికులు.. జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రి మ్యాట్రన్ సుదక్షిణాదేవి.. అంబులెన్స్ను పంపించి ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్య చికిత్స అందించారు.
ప్రస్తుతం నర్సమ్మ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. కాగా, తల్లిని స్మాశాన వాటికలో చేర్చిన ధర్మయ్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ కొడుకులు, కూతుర్లు కూడా ఇలా చేస్తే.. నువ్వు కూడా స్మశానంలోనే ఉంటావంటూ మండిపడుతున్నారు.