ముదురుతోన్న ములుగు వివాదం : జిల్లా ఏర్పాటు కోసం వ్యక్తి ఆత్మహత్య
ములుగు : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొంతమందిలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. ముందుగా అనుకున్న 25 జిల్లాల సంఖ్య కాస్త ఇప్పుడు 31కి చేరుకున్నా.. మరిన్ని కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెరమీదకు వస్తుండడం గమనార్హం. సిరిసిల్ల, జనగామ, గద్వాల లాంటి జిల్లాలు ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసనల ద్వారా మొత్తానికి జిల్లాలను సాధించుకోగా.. ఇప్పుడు కొత్తగా తెరపపైకి వచ్చిన ములుగు జిల్లా ఏర్పాటు కోసం అక్కడి ప్రజలు రోడ్డెక్కుతున్నారు.
ములుగును కాకుండా భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ములుగు ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 31 జిల్లాలనే ఫైనల్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉండడంతో.. ములుగు జిల్లా ఏర్పాటు కోసం అక్కడి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. గత రెండు రోజులుగా ములుగులో స్థానికులు రాస్తారోకోలు, నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు భిక్షపతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ క్రమంలోనే భిక్షపతి ఒక్కసారిగా అతని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.