ప్రభాస్ రాకుంటే సెల్ టవర్ మీద నుండి దూకి చనిపోతానని హల్ చల్ చేస్తున్న యువకుడు
జనగామ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేస్తున్నాడు. ప్రభాస్ వస్తేనే దిగుతానని తేల్చి చెబుతున్నాడు. మహబూబాబాద్ కు చెందిన గుగులోతు వెంకన్న అనే వ్యక్తి జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉడుముల హాస్పిటల్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నానా హంగామా సృష్టిస్తున్నాడు. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
ఎవరెంత చెప్పినా తన సెల్ టవర్ దిగేది లేదని తేల్చి చెప్తున్నాడు. సినీ హీరో ప్రభాస్ వెంటనే జనగామ కి రావాలని , లేకుంటే అక్కడి నుంచి దూకి చనిపోతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
ఇక తాజాగా సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి ఉంటాడని కొందరు చర్చించుకుంటే, మరి కొందరు అతనికి మతిస్థిమితం సరిగా లేదేమో అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సాహో సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు అయిన తరువాత సెల్ టవర్ ఎక్కడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాక , అసలు అతను సెల్ టవర్ ఎక్కడానికి వెనుక ఉన్న కారణమేంటో సరిగా బోధపడక స్థానికులు, పోలీసులు అతను కిందకు దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు విజ్ఞప్తి సైతం పట్టించుకోకుండా వెంకన్న తన హంగామా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అతనిని క్రిందికి దించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. తన కోసం సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి కోసం ప్రభాస్ మరి స్పందిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికర అంశమే .