వివాహేతర బంధం, లైంగిక దాడి?: బాత్రూంలో వివాహిత దారుణ హత్య
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితను స్నానాల గదిలో ఉండగా ఆమె గొంతుకు తువ్వాల, బెల్టు బలంగా బిగించిన దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం మృతురాలి భర్త, ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోవడంతో భర్తే ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని నక్కపల్లికి చెందిన బొద్దాడి రాజు(32), భార్య రాజేశ్వరి(28) వీరి ఇద్దరు పిల్లలు ఆకాశ్(10), మహి(8) బోరబండ సమీపంలోని ఆరోగ్యనగర్లో నివసిస్తున్నారు. రాజు ఏ పనీ చేయకుండా తిరుగుతుండగా, భార్య రాజేశ్వరే ఓ వ్యాయామశాలలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం వీరి ఇంటికి వెళ్లిన పక్కింటి మహిళ.. స్నానాల గదిలో రాజేశ్వరి అచేతనంగా ఉండటం చూసి స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చే సరికే ఆమె ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. ఆమె మెడను తువ్వాల, బెల్టుతో చుట్టి గట్టిగా లాగడంతో మృతిచెందినట్లు భావిస్తున్నారు.
రాజేశ్వరి తల, శరీరంపై కూడా గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజు, రాజేశ్వరి రెండు నెలల కిందటే ఆరోగ్యనగర్కు వచ్చారని, ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. వారి పిల్లలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లగా.. అప్పటికే వారిని తండ్రి తీసుకెళ్లారని ఉపాధ్యాయులు తెలిపారు.
వివాహేతర సంబంధం విషయంపైనా తరచూ గొడవలు జరిగేవని పోలీసుల దర్యాప్తులో తేలింది. గొడవ పడి భర్తే ఇలా చేశాడా? లేక మరెవరైనా చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త పరారీలో ఉండటంతో అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.