భర్త తనను విమానంలో తీసుకెళ్లలేదని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: ఇటీవల కాలంలో చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. యువతతోపాటు పెద్దలు కూడా ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా, ఓ వివాహిత తనను తన భర్త విమానంలో తిరుపతికి తీసుకెళ్లలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.
సారీ సునీల్! సహోద్యోగుల శారీరక, మానసిక వేధింపులతో భెల్ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ..
ఘటనకు సంబంధిచిన వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన ప్రవళ్లిక(30కు హైదరాబాద్లోని ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీ నగర్లో నివసించే వెంకటరమణ(38)కి 2014లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం 9నెలల వయస్సున్న రిత్విక అనే కుమార్తె ఉంది. మాదాపూర్లోని ఆదిత్య బిర్లా సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది ప్రవళ్లిక
విమానంలో తీసుకెళ్లమంటూ..
కాగా, అక్టోబర్ 10న రిత్విక పుట్టువెంట్రుకలు తిరుపతిలో తీయాల్సి ఉంది. ఇందుకోసం రైలు టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. అనుకోకుండా వీరి ప్రయాణం వాయిదా పడింది. దీంతో విమానంలో తిరుపతికి వెళ్దామని భర్తను కోరింది ప్రవళ్లిక. భర్త ఇందుకు అంగీకరించకపోవడంతో వీరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. వారం రోజుల తర్వాత అంతా కలిసి రైలులో వెళ్దామని వెంకటరమణ.. ప్రవళ్లికకు సర్దిచెప్పారు.
పట్టువీడని ప్రవళ్లిక..
అయితే, ప్రవళ్లిక మాత్రం ఈ విషయంలో రెండుమూడు రోజులుగా భర్తతో గొడవపడుతూనే ఉంది. తన భర్త తనకంటే అతని తల్లిదండ్రులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని ప్రవళ్లిక మనస్తాపానికి గురైంది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన ప్రవళ్లిక.. భర్తతో మాట్లాడకుండా గదిలోకి వెళ్లి గడియపెట్టుకుంది.
ఆలిగిపడుకుందనుకున్న భర్త.. కానీ..
అయితే, గొడవ నేపథ్యంలో అలిగిపడుకుందని భావించాడు వెంకటరమణ. గురువారం ఉదయం తలుపుకొట్టగా.. ఎంతకూ తీయకపోవడంతో కిటికీలోంచి చూసేసరికి ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే తలుపులను బద్దలు కొట్టి.. ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రవళ్లిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.